వ్యవసాయ కార్మికులు, దళితులు, ఆదివాసీలను పట్టించుకోని పాలకులు
బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో డి.రాజా
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి/న్యూదిల్లీ : వ్యవసాయ కార్మికులు, దళితులు, ఆదివాసీల సమస్యలపై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికిగాను ఉద్యమాలు నిర్మించుకోవాలని సంఘాలకు సూచించారు. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) జాతీయ కార్యవర్గ సమావేశాలు దిల్లీలోని అజయ్ భవన్లో బుధవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజులు జరిగే సమావేశాల్లో డి.రాజా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి బీకేఎంయూ జాతీయ అధ్యక్షుడు పెరియాస్వామి అధ్యక్షత వహించారు. డి.రాజా మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి గౌరవప్రదమైన సంఖ్య రాలేదన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ, నితీశ్కుమార్, చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిరదని, ఇది సుస్థిర ప్రభుత్వం కానే కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగల్భాలు పలికారని, ఫలితాల తర్వాత మోదీ నోరు మూగబోయిందని రాజా విమర్శించారు. వ్యవసాయ కార్మికులు, రైతుల ముందు పెద్ద సవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని సాధించుకోవడానికి ఉద్యమాలు రూపొందించాలని, అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు పేదలు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావడం లేదన్నారు. సంఘం అభివృద్ధికి బాటలు వేసుకోవాలని, గ్రామాల్లో బలంగా సంఘ నిర్మాణం జరగాలని సూచించారు. బీకేఎంయూ జాతీయ అగ్ర నాయకులు నాగేంద్రనాథ్ ఓరaా మాట్లాడుతూ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. ప్రభుత్వరంగ సంస్థలు కనుమరుగుకావడంతో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పేదలకు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్ సౌకర్యమూ పేదల దరిచేరడం లేదని, ప్రతి పేద వారికీ 55 సంవత్సరాలకే రూ.6 వేలు అందించాలని డిమాండ్ చేశారు. భూ సంస్కరణ చట్టం దేశవ్యాప్తంగా అభాసుపాలైందని నిందించారు. బీకేఎంయూ నిర్ణయాలు, భవిష్యత్ కార్యక్రమంపై సంఘం ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా వివరించారు. సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఉప ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రావు, బి.కేశవరెడ్డి, తెలంగాణ నుంచి బాలమల్లేశ్, కలకండ కాంతయ్య పాల్గొన్నారు.