. హీనమైన పద్ధతిలో తొలగింపు
. బీజేపీ కార్యాలయంలో ఉండగానే నడ్డా ఫోన్
. కొద్దిసేపటికే పురందేశ్వరిని నియమిస్తూ ప్రకటన
. హఠాత్ పరిణామాలతో కంగుతిన్న కమలనాథులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఆ పార్టీ అధిష్ఠానం కోలుకోలేని షాక్ ఇచ్చింది. వీర్రాజుపై పార్టీలో తీవ్ర అసంతృప్తి ఉన్నప్పటికీ ఇంత అవమానకర పద్ధతుల్లో తొలగిస్తారని కమలనాథులు ఊహించలేదు. కేవలం ఫోన్ కాల్ ద్వారా సోము వీర్రాజును బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తొలగించడం, కొద్ది గంటలకే పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరిని నియమించడం చకచకా జరిగిపోయాయి. గంటల వ్యవధిలో జరిగిన ఈ వరుస పరిణామాలతో కమలనాథులు కంగుతిన్నారు. వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలతో పాటు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై రాష్ట్ర బీజేపీలో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతూ వచ్చింది. పార్టీలో ఒక బృందం దిల్లీ వెళ్లి అధిష్ఠానానికి నేరుగా ఫిర్యాదు చేసింది. గతంలో ప్రజాబలం ఉన్న నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడటానికి కారణం కూడా సోము వీర్రాజేనని కొందరు నేతలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల లీగల్ సెల్ సమావేశంలో సోము వీర్రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీలో ఉంటే గెలవలేమనే రీతిలో సోము వీర్రాజు చెప్పడం, తాను వేరే పార్టీలోకి వెళ్లి ఉంటే గెలిచేవాడిననడాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడి మార్పు తప్పదని భావించిన అధిష్ఠానం సోము వీర్రాజును పక్కనపెట్టి…పురందేశ్వరికి పగ్గాలు అప్పగించింది. సోము వీర్రాజుకు జేపీ నడ్డా స్వయంగా ఫోన్ చేసి ‘మీ టర్మ్ అయిపోయింది.. మిమ్మల్ని తప్పిస్తున్నాం.. రాజీనామా చేయాలి’ అని సూచించారు. బీజేపీ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమాన్ని సోము వీర్రాజు నిర్వహించిన కొద్దిసేపటికే ఆయన ఈ వార్త వినాల్సి వచ్చింది. ఆ తర్వాత కొత్త అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం పురందేశ్వరి అమర్నాథ్ యాత్రలో ఉన్నారు.
పురందేశ్వరి ప్రహసనం ఇలా…
మాజీముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు మరణానంతరం ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి, 2009లో విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ 2014లో బీజేపీలో చేరారు. తొలుత మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన పురందేశ్వరి…తర్వాత పార్టీ ప్రధానకార్యదర్శిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర ఇన్చార్జిగా ఉన్నారు.