. హాజరుకానున్న ముఖ్య నేతలు
. ఎన్నికల్లో భాగస్వామ్య పార్టీల పనితీరుపై సమీక్ష
న్యూదిల్లీ : ఓట్ల లెక్కింపునకు ముందు జూన్ 1వ తేదీన ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కీలక సమావేశం నిర్వహించనున్నాయి. ఈ సమావేశంలో భాగస్వామ్య పార్టీల ముఖ్యనేతలు పాల్గొనబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలు కనబర్చిన పనితీరును సమీక్షించుకునేందుకు ఈ భేటీని నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. తుది విడత పోలింగ్ జరుగుతున్న జూన్ 1వ తేదీనే ఇండియా కూటమి పార్టీలు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడిరది. సమావేశానికి హాజరుకావాలంటూ అన్ని పార్టీలకు ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే సమాచారం పంపినట్లు తెలిసింది. కాగా జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఆ తేదీకి సరిగ్గా మూడు రోజుల ముందు జరుగుతున్న ఇండియా కూటమి సమావేశంపైనే అందరి దృష్టి ఉంది. ఏడు విడతల పోలింగ్ ఘట్టంపై ఇండియా కూటమి పార్టీలు పెట్టుకున్న అంచనాలు ఏంటి? అనే దానిపై జూన్ 1న కూటమి తరపున ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఏ పార్టీలు హాజరవుతాయి? ఏవి హాజరుకావు? అనేది కూడా వేచిచూడాలి. ప్రత్యేకించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలకు దూరంగా ఉండిపోయిన మమతా బెనర్జీ ఈ కీలక సమావేశానికి హాజరవుతారా, లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తీహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోనున్నారు. ఇది జరగడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఇండియా కూటమి మిత్రపక్షాలు భేటీ అవుతుండటం గమనార్హం.
ఇక ఈ సమావేశానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ సహా కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 272 లోక్సభ సీట్లను ఇండియా కూటమి అవలీలగా గెలుస్తుందని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఆశాభావంతోనే జూన్ 1 సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.