కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొలువు దీరిన కూటమి ప్రభుత్వం కొత్త మంత్రివర్గ తొలి సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు సచివాలయం మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై 21వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖల కార్యదర్శులకు సీఎస్ నీరబ్కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొత్త మంత్రులు ఒక్కొక్కరిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. 23వ తేదీలోగా మిగిలిన మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించాలని సీఎం సూచించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరగనున్న తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు కొత్తగా ఎన్నికైన శాసనసభ సభ్యుల ప్రమాణస్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం 21, 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్… అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.