మహిళలకు దీపావళి కానుకగా అమలు
. ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు అందజేత
. 24 నుంచి బుకింగ్ ప్రక్రియ… 31 నుంచి లబ్ధిదారులకు పంపిణీ
. సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5 సంతకాలతో మేనిఫెస్టో హామీలను, అన్న క్యాంటీన్ వంటి కార్యక్రమాలను అమలులోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల అమలుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 31వ తేదీ నుంచి దీపావళి సందర్భంగా దీపం పథకాన్ని మహిళలకు అందించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తామని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీనిలో భాగంగా దీపం పథకాన్ని దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నారు. మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని… దీపావళి నుంచి సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగమైన దీపం పథకం అమలు గొప్ప ముందడుగు అని సీఎం వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంపై సోమవారం వెలగపూడి సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఆ శాఖ అధికారులు, చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. దీపం పథకం అమలు, విధివిధానాలపై సమీక్ష జరిపారు. ఆర్థిక సమస్యలు ఉన్నా పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అర్హులయిన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని స్పష్టం చేశారు. ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కలిగి, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని వర్తింప చేయాలన్నారు. ప్రతి నాలుగు నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆయా లబ్ధిదారు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈనెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలని, 31వ తేదీ నుంచి గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు రెండు రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీని జమ చేయాలని, ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళలకు ఇంటి ఖర్చులు తగ్గించాలనే ఆలోచనతో ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చామని, ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. వంట గ్యాస్ కోసం వెచ్చించే ఖర్చును గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అన్నారు. అర్హత గల ఏ ఒక్క లబ్ధిదారునికి ఈ పథకం రాలేదనే విమర్శ రాకుండా కట్టుదిట్టంగా కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో తొలుత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్యదర్శి వీరపాండ్యన్ ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పవర్ పాంయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 కాగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సిలిండర్కు రూ.25ల సబ్సిడీ ఇస్తుండగా ప్రస్తుతం సిలిండర్ ధర రూ.851గా ఉందని వివరించారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల అదనపు భారం పడుతుందని, అదే ఐదేళ్లకు కలిపి రూ.13,423 కోట్ల అదనపు భారం పడుతుందని వివరించారు.