. ‘ఇండియా’తోనే ప్రజా ప్రభుత్వం
. ప్రజా పోల్స్లో వెల్లడి
. బీజేపీ ఆశలు గల్లంతు తప్పదు
. ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం ఈసీకి వినతి: ఖడ్గే
. కౌంటింగ్పై ‘ఇండియా’ పార్టీల సమీక్ష
. ఏజెంట్లకు మార్గదర్శకాలు
న్యూదిల్లీ:
రాబోయేది ఇండియా కూటమి ప్రభుత్వమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఉద్ఘాటించారు. అధికారం చేపట్టేందుకు కావాల్సిన 295కుపైగా స్థానాల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఇండియా కూటమికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెబుతారన్నారు. ఇండియా కూటమి నాయకులు శనివారం ఖడ్గే నివాసంలో రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఎన్నికలు ముగిసిన క్రమంలో 4వ తేదీన ఓట్ల లెక్కింపు రోజున తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరిపారు. పార్టీ కార్యకర్తలకు, కౌంటింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు విడుదల చేశారు. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎగ్జిట్ పోల్స్పై టీవీల్లో నిర్వహించే చర్చలకు హాజరు కావాలని ఇండియా కూటమి నిర్ణయించింది.
సమావేశం అనంతరం ఖడ్గే విలేకరులతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పాక్షికంగా సాగేలా చూడాలని కోరేందుకు ఈసీ సమయాన్ని కోరినట్లు తెలిపారు. 295కుపైగా స్థానాల్లో గెలుస్తామని, ప్రజల తీర్పు అనుకూలంగా రాబోతోందని చెప్పారు. ఇండియా కూటమి అధ్వర్యంలో కేంద్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. ‘ఇండియా కూటమి 295కుపైగా స్థానాల్లో గెలుస్తుంది. నాయకులందరితో మాట్లాడిన తర్వాతే ఈ అంచనాకు వచ్చాం. ఇది ప్రజాసర్వే. ఈ మేరకు సమాచారం ప్రజల నుంచి నాయకులకు చేరింది. ప్రభుత్వ సర్వేలు, ప్రభుత్వ మీడియా మిత్రులు సంఖ్య పెంచి మురిపిస్తున్నాయి. ప్రజలకు నిజమేమిటో చెప్పే ప్రయత్నాన్ని కూటమి నాయకులు చేస్తున్నారు. మన పోరు పూర్తి కాలేదు. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తమ వంతు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ఖడ్గే అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సానుకూల ఫలితాన్ని ఆశిస్తున్నామని, సర్వశక్తులు ఒడ్డి పోరాడామని, భారతీయులంతా అండగా నిలిచారని, ప్రజల పోల్ గెలుస్తుందని, బీజేపీ ఎగ్జిట్ పోల్స్ చిత్తవుతాయని ఖడ్గే వ్యాఖ్యానించారు.
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇండియా కూటమి ముందుకు వెళుతోందన్నారు. 295కుపైగా స్థానాల్లో ఇండియా కూటమి గెలుస్తుందని చెప్పారు. బీజేపీకి 200 స్థానాలు వస్తాయని, అదే ఎన్డీయేగా లెక్కేస్తే 235 స్థానాలు వస్తాయన్నారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వస్తాయి. బీజేపీ ఓడిపోతుంది. ఆయన (మోదీ) సముద్రాన్ని చూసేందుకు వెళ్లారు. ప్రజలకు వెన్నుచూపారు’ అని అన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ మార్పు కోసం ప్రజలు ఓటేశారని చెప్పారు. ఇండియా కూటమికి 295కుపైగా స్థానాలు లభిస్తాయన్న అంచనా ఉందన్నారు. అప్రమత్తంగా ఉండాలని తమ ఏజెంట్లను ఇండియా కూటమి పార్టీలు మార్గనిర్దేశం చేశాయని చెప్పారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలని కోరేందుకు ఈసీ అపాయింట్మెంటు కోరినట్లు రాజా తెలిపారు. జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ మాట్లాడుతూ ‘ఇండియా కూటమి జార్ఖండ్లో రాణిస్తుందని, 10కిపైగా స్థానాల్లో గెలుస్తుందని, 295కుపైగా స్థానాలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ‘ప్రజలు గెలవబోతున్నారు… ఇండియా గెలుస్తుంది. జూన్ 4 తర్వాతే ప్రధాని అభ్యర్థి ఎవరో నిర్ణయిస్తాం’ అని అన్నారు. ‘400 పార్’ అనే బీజేపీ చిత్రం మొదటి దశలోనే ఫ్లాప్ అయిందని విమర్శించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ ఫలితాలు వచ్చాక ఉమ్మడి కనీస కార్యక్రమం రూపొందుతుందని, కొత్త ప్రభుత్వానికి అదే ఆధారమవుతుందని తెలిపారు. ఇండియా సమావేశంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, దీపాంకర్ భట్టాచార్య, కల్పనా సోరెన్, రాఘవ్ చడ్డా తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ, పీడీపీ అధినేతలు మమతా బెనర్జీ, మెహబూబా ముఫ్తీ వేర్వేరు కారణాలతో గైర్హాజరయ్యారు.
ఎగ్జిట్ పోల్స్ చర్చల్లో పాల్గొంటాం: పవన్ ఖేరా
ఎగ్జిట్ పోల్స్పై జరిగే టీవీ చర్చల్లో ఇండియా కూటమి పాల్గొంటుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా తెలిపారు. ఇండియా కూటమి భేటీ అనంతరం ఈ మేరకు నిర్ణయం జరిగిందని వెల్లడిరచారు. ఎగ్జిట్ పోల్స్ ఫిక్సింగ్ చేసే బీజేపీ నిజరూపాన్ని బట్టబయలు చేయాలని ఇండియా కూటమి సంకల్పించినట్లు తెలిపారు. తొలుత ఎగ్జిట్ పోల్స్పై చర్చల్లో పాల్గొనరాదని భావించగా, శనివారం భేటీ క్రమంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నట్లు పవన్ ఖేరా వెల్లడిరచారు.
కలెక్టర్లకు అమిత్షా బెదిరింపులు: జైరాం రమేశ్
కేంద్ర మంత్రి అమిత్ అన్ని జిల్లా మెజిస్ట్రేట్లు, కలెక్టర్లను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ‘కేంద్ర హోంమంత్రి… అందరు డీఎంలు/కలెక్టర్లకు ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 150 మందితో మాట్లాడారు. దీనిని బట్టి అధికారం కోసం బీజేపీ ఎంతలా ప్రాకులాడుతున్నదో అర్థం చేసుకోవచ్చు’ అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.