శ్రీ సత్యసాయి జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు కుంభవృష్టి కురిసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు రికార్డు స్థాయిలో జిల్లా వ్యాప్తంగా సరాసరి 1902.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటు వర్షపాతం 59.4 మిల్లీమీటర్లు. ఇదే నెలలో వారం క్రితం ఒకేరోజు 1700 మిల్లీమీటర్ల సరాసరి వర్షపాతం జిల్లాలో నమోదు కాగా, సగటు వర్షపాతం 50 మిల్లీమీటర్లు. ఇదే ఇదివరకు జిల్లాలో రికార్డ్ వర్షపాతం. దీనికి మించి సోమవారం రాత్రి ఏకంగా 1902.2 సరాసరి వర్షపాతం, సగటు వర్షపాతం 59.4 మిల్లీమీటర్ల కురవడం విశేషం. జిల్లాలో కురిసిన కుంభవృష్టి వర్షం కారణంగా జిల్లాలోని అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండి మరువ వెళ్తున్నాయి. ప్రధానంగా జిల్లాలోనే పెద్ద చెరువుగా ప్రసిద్ధి చెందిన ధర్మవరం చెరువు మొదటి మరువ వెళుతుండడం విశేషం. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలంలో గల చెన్నకేశవ స్వామి గుడి (సీజీ ప్రాజెక్ట్) ప్రాజెక్టు నుండి నిండుకుండలా కనిపిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఒక గేటును ఎత్తి నీటిని వదిలారు. కావున ప్రాజెక్టు పరిధిలోని గ్రామాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ముందస్తు హెచ్చరికలు చేశారు. జిల్లాలో అత్యధికంగా కనగానిపల్లి మండలంలో 198.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని అనేక చెరువులు, కుంటలు నిండిపోయాయి. ప్రధానంగా మండల పరిధిలోని దాదలూరు గుడి వద్ద జాతీయ రహదారికి అనుకుని ఉన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతికి పశువులు సైతం కొట్టుకుపోయాయి.