గ్రూప్-1 మెయిన్స్పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రధాన పరీక్షకు 1:100 ప్రాతిపదికన ఎంపికచేయాలని ఉద్యోగార్థులు గతకొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలుపుకోవాలని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో గ్రూప్-1 మెయిన్స్పై టీజీపీఎస్సీ స్పష్టతనిచ్చింది. మెయిన్స్కు 1:50 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తామని తేల్చిచెప్పింది. పరీక్షకు సిద్ధమవుతున్నది. కాగా, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు తమ పోరాటాలను ఉధృతం చేస్తున్నారు. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేలాది సంఖ్యలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు గడువు అని అల్టిమేటం జారీచేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే నిరుద్యోగుల ధర్నా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి అమలు, గ్రూప్ 2, 3, డీఎస్సీలో పోస్టుల పెంపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ను ఫిబ్రవరి 19న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ను ప్రకటించింది. ఈ పోస్టులకు జూన్ 9న పిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. త్వరలోనే ఈ ఫలితాలు వెలువనున్నాయి. ఇక అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఇందులో మొత్తం 7 పేపర్లు ఉండనున్నాయి. ఇంగ్లిష్ క్వాలిఫయింగ్ పేపర్ కావడంతో పదో తరగతి స్టాండర్డ్లో నిర్వహించనున్నారు. ఈ మార్కులను మెయిన్స్ మొత్తం మార్కులలో కలుపరు.
గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్..
గ్రూప్-1 మెయిన్స్ లో ఆరు పేపర్లు ఉంటాయి. ప్రతీ పేపర్ ను 3 గంటల వ్యవధిలో 150 మార్కులకు నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షలను ప్రతీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహిస్తారు.