ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్దతులకు విరుద్ధమన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు ఉందని.. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని.. పార్లమెంటులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకాని ఈ నిబంధన పాటించలేదన్నారు.
అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే తనపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు జగన్. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల ద్వారా బయటపడ్డాయని.. ఇలాంటి సమయంలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజాసమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని.. ప్రతిపక్ష పార్టీ హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది అన్నారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని లేఖను పరిశీలించాలని కోరుతున్నాను అన్నారు. ఈ మేరకు లేఖను అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడికి పంపించారు.
మరోవైపు కూటమి ప్రభుత్వం శుక్రవారం జరిగి అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్కు తగిన గౌరవం ఇచ్చామని చెబుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది.. దీంతో ఆ పార్టీకి, జగన్కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. అయితే మిగిలిన ఎమ్మెల్యేల మాదిరిగా ఆయన కూడా సాధారణ సభ్యుడు అనే వాదన ఉంది. అయితే జగన్కు సభలో ప్రాధాన్యమివ్వాలని వైఎస్సార్సీపీ శాసన సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను రిక్వెస్ట్ చేసింది. ఆ విషయాన్ని మంత్రి పయ్యావుల చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా.. మాజీ సీఎం పట్ల ఉదారంగా, గౌరవంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రి ఆదేశించారు. సాధారణ ఎమ్మెల్యేలు తమ వాహనాలను అసెంబ్లీ ప్రాంగణం బయటే ఉంచాలి.. అక్కడ దిగి నడుచుకుంటూ అసెంబ్లీ లోపలికి రావాాల్సి ఉంటుంది. కానీ జగన్ తన వాహనంలోనే సభ ప్రాంగణం లోపలికి కూడా రావడానికి అనుమతించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ మేరకు అసెంబ్లీ ప్రారంభమైన తొలి రోజు భవనంలోని ప్రధాన ద్వారం వరకూ ఆయన వాహనాన్ని అనుమతించారు. అంతేకాదు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో.. ఆయన మిగిలిన సభ్యులతోపాటు అక్షర క్రమంలో తన పేరు వచ్చినప్పుడు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. కానీ ఆ విషయంలో కూడా జగన్కు మినహాయింపు ఇచ్చారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ప్రమాణం తర్వాత జగన్తో ప్రమాణం చేయించాలని సూచించారట.. అయితే జగన్ సభలోకి ఆలస్యంగా రావడంతో.. అప్పటికి మంత్రులు ప్రమాణం చేసేశారని చెబుతున్నారు. అందుకే ఆ తర్వాత జగన్తో ప్రమాణం చేయించినట్లు చెబుతున్నారు. అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి తగిన సంఖ్యాబలం లేకపోయినా.. జగన్కు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా.. ఆయనకు అధికార పక్షం గౌరవం ఇస్తుందని సభావ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ కూడా స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి తనకు రిక్వెస్ట్ వచ్చిందని.. ఈ విషయం సీఎం చంద్రబాబుకు చెప్పగానే.. ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. అందుకే జగన్కు తగిన గౌరవం ఇస్తున్నామన్నారు.