. మధ్యంతర ఉత్తర్వులిచ్చిన దిల్లీ హైకోర్టు
. ఈడీ పిటిషన్పై అత్యవసర విచారణ
. 25న తుది తీర్పు
న్యూదిల్లీ : మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. గురువారం దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం మంజూరు చేసిన సాధారణ బెయిల్ను శుక్రవారం దిల్లీ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్ బెయిల్పై మంగళవారం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అప్పటి వరకు సీఎం కేజ్రీవాల్ను తీహార్ జైలులోనే ఉండాలని దిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోట్రయల్ కోర్టులో విచారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్ రవీందర్ దూదేజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్ను సవాల్ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్పై తాము విచారణ పూర్తి చేసే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాల అమలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కాగా మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు గురువారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేయవచ్చని ఆదేశించింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీలుగా దానిని 48 గంటలపాటు పక్కనపెట్టాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. ఆ వినతిని ట్రయల్ కోర్టు తిరస్కరించింది. శుక్రవారం ఆయన తీహార్ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ‘బెయిల్ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్ బెంచ్ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు’ అని ఈడీ తరపు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హైకోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను నిలిపివేసి… తమ పిటిషన్పై అత్యవసర చర్యలు చేపట్టాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడిరచింది. అప్పటివరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.
ఈడీ వైఖరిపై సునీత కేజ్రీవాల్ మండిపాటు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఈడీ తీరుపై మండిపడ్డారు. దిల్లీలో నీటి సమస్యను పరిష్కరించాలని ఆమ్ఆద్మీ పార్టీ నేతలు శుక్రవారం భోగల్లో చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఇందులోభాగంగా సునీత మాట్లాడుతూ తన భర్త బెయిల్ ఆర్డర్ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే ఈడీ ఎలా సవాలు చేస్తుందని ప్రశ్నించారు. దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని అసహనం వ్యక్తంచేశారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్ను ఉగ్రవాదిలా చూస్తున్నారన్నారు. హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
దిల్లీ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో దేశ రాజధానికి రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల నీటిని హరియాణా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ మంత్రి ఆతిశి నిరాహార దీక్ష చేస్తున్నారు. నీటి సంక్షోభాన్ని పరిష్కరించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఆమె బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.