. రేపటి నుంచి సీఎం కసరత్తు బ వైసీపీ నేతల్లో టెన్షన్
. తేలని ఒంగోలు పంచాయితీ
. అసంతృప్త ఎమ్మెల్యేల అయోమయం
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: వైసీపీ ఏడో జాబితాపై కసరత్తునకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సిద్ధమ య్యారు. ఈనెల 12 నుంచి మిగిలిన అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ వర్గాలపై సీఎం దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. మరికొన్ని నియోజకవర్గాల నేతలు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి తరలి రానున్నారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు సీఎం దిల్లీ పర్యటన నేపథ్యంలో ఏడో జాబితాపై కసరత్తు ఆలస్యమైంది. ఇప్పటికే వైసీపీ ఆరు జాబితాలను విడుదల చేసింది. ఇందులో దాదాపు అసెంబ్లీ ఇన్ఛార్జ్ల మార్పులు, చేర్పుల ప్రక్రియ పూర్తి దశకు చేరింది. ఐదు పార్లమెంటు స్థానాలపైనా కొలిక్కి రావాల్సి ఉంది. ఒంగోలు పంచాయతీ జగన్కు తలనొప్పిగా మారింది. ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి వైఖరి అంతుపట్టడం లేదు. ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలంటూ బాలినేని ఇంకా పట్టుపడుతున్నారు. చెవిరెడ్డికి బాధ్యతలను అప్పగించడంపై ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా ఉంది. ఇంటా, బయటా వారికి నిరసన సెగ ఎదురైంది. సొంత పార్టీలో టికెట్లు రాక, ఇతర పార్టీల వైపు వెళ్లేందుకు సిద్ధమవగా అక్కడా అసమ్మతి పోరు మొదలయింది. దీంతో ఎలాగైనా పార్టీ మారదామనుకుంటే… మధ్యలో రాజ్యసభ ఎన్నికలు తెరపైకి వచ్చాయి. దానికితోడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారికి స్పీకర్ నోటీసులు జారీజేయడం వెరసి వైసీపీ అసమ్మతి నేతల ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. ఈ నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే వైసీపీ అనర్హత వేటు వేస్తుందన్న ఆందోళనతో వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలున్నారు. దీంతో రాజ్యసభ ఎన్నికల తర్వాత మూకుమ్మడిగా ఇతర పార్టీల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా టీడీపీ, జనసేన పొత్తులతో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణ ఎలా ఉంటాయనే దానిపైనా తర్జనభర్జన పడుతున్నారు. టీడీపీ జనసేనకు తోడుగా బీజేపీ అంశం తెరపైకి రావడంతో నియోజవర్గాల్లో సీట్లు సర్దుబాటు పెద్ద తలనొప్పిగా మారనుంది. బీజేపీ పొత్తుపై స్పష్టత వచ్చాకే సీట్లు ప్రకటించాలని టీడీపీ, జనసేన నిర్ణయించుకున్నాయి. దీంతో వైసీపీ నుంచి వెళ్లే వారికి అక్కడ బెర్తులు దొరుకుతాయా?, లేదా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది.
వైసీపీ ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న టీడీపీ నేతలు
టీడీపీలోకి వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలను ఆయా నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. వారి రాకతో తమ టికెట్లు గల్లంతవుతాయన్న ఆందోళనతో వారున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, వసంత కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే రక్షణ నిధికి టికెట్ల రాకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. వారు ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలతో టచ్లో ఉన్నట్లుగా ఉంది. అనుకున్న సమయానికి వారు టీడీపీలో చేరలేకపోయారు. వారు కోరుకుంటున్న నియోజకవర్గాల టికెట్లపై టీడీపీ నుంచి స్పష్టత రాలేదు. దీంతో సొంత వైసీపీలో కంటే, చేరబోయే టీడీపీలోనూ వారికి తలనొప్పులు ఎదురవుతున్నాయి. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి వైసీపీ నుంచి పెనమలూరు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఆయనకు టీడీపీలోనూ పెనమలూరు టికెట్ ఇచ్చేందుకు స్పష్టత లేదు. ఆయనను నూజివీడు నుంచి పోటీ చేయించేందుకు టీడీపీ అధిష్ఠానం పరిశీలిస్తుండగా, ప్రస్తుత అక్కడి ఇన్ఛార్జ్ ముద్రబోయిన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పెనమలూరులోనూ పార్థసారథికి అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడ్డుపడుతున్నారు. మైలవరంలో అదే పరిస్థితి నెలకొంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలోకి వెళ్లేందుకు దాదాపు సిద్ధమవగా ఆయనకు మైలవరం టికెట్పై స్పష్టత రాలేదు. మైలవరం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో వసంతకు మైలవరం టికెట్ ప్రశ్నార్ధంగా మారింది. రాజకీయ సమీకరణల భాగంగా ఆయనను పెనమలూరుకు పంపితే ఎలా ఉంటుందనే దానిపై టీడీపీ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిసింది. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ ఇది కూడా పామర్రు టీడీపీ టికెట్ను ఆశిస్తుండగా అక్కడ వర్ల రామయ్య తనయుడుని ఇన్ఛార్జ్గా ప్రకటించడంతో చుక్కెదురైంది. ఈ రాజకీయ సమీకరణలతో ఆయనకూ దిక్కుతోచడం లేదు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పరిస్థితి యథాతథంగా ఉంది. ఆయన టీడీపీలోకి లేదా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించగా, ఇప్పటికే అక్కడున్న నేతలు అడ్డు తగులుతున్నారు. దీంతో పార్టీ మారితే అసలు టికెట్ వస్తుందో, లేదో తెలియక అయోమయంలో ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్యే టికెట్ను కేటాయించకపోవడంతో ఆయన అలక వహించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరారు. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల దిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఈ దిశగా మిగిలిన వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు ముందుకు రాలేకపోతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు హాజరై, తాము వైసీపీ వెంటే నడుస్తామని, జగన్ నాయకత్వం బలపరుస్తామని ప్రకటించారు. దీంతో నెమ్మదిగా వైసీపీలో అసంతృప్తుల సంఖ్య తగ్గు ముఖం పడుతోంది. దీనిని చూసిన మిగిలిన అసంతృప్త ఎమ్మెల్యేలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.