సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ
విశాలాంధ్ర – విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి విద్యావ్యవస్థను తిరోగమనంలో నడిపిస్తు న్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా మార్పు చేసి, మెరుగుపరుస్తామని ఎన్నికలకు ముందు జగన్హన్రెడ్డి వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తదుపరి రాను రాను విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. నాడు నేడు పేరుతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే చోద్యం చూస్తోందని ఎద్దేవా చేశారు. దాదాపు 9 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారని, 9 నెలల్లోనే 6.41 మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారని తెలిపారు. 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్తో బోధన అంటూ 3,4,5 తరగతులను ఉన్నత, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో కలిపారని చెప్పారు. 4234 ప్రాథమిక పాఠశాలను ఇతర పాఠశాలలో విలీనం చేశారని పేర్కొన్నారు. 98 మంది లోపు విద్యార్థులు ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలకు సబ్జెక్టు టీచర్లను ఇవ్వలేమని, అక్కడ చదివే విద్యార్థులను వేరే స్కూళ్లలో చేర్చుకోవాలని సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పటం విచారకరమన్నారు. అనేక గ్రామాల్లో ఒకటి రెండు తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. గత నెల 28న అమ్మఒడి కోసం సీఎం జగన్ బటన్ నొక్కినప్పటికీ నేటికీ చాలామంది తల్లుల ఖాతాల్లో నగదు పడలేదన్నారు. జగనన్న విద్యా కానుకలో పిల్లలకు ఇచ్చే బ్యాగులు, బూట్లు నాసిరకంగా ఉన్నాయని తెలిపారు. విదేశీ విద్యా దీవెన అందని ద్రాక్షగా మారిందని, మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పాఠశాల విద్యా వ్యవస్థను తిరోగమనంలో నడిపిస్తున్నారని విమర్శించారు. మరోపక్క యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లుగా జగన్ తన భజనపరులను నియమించారని విమర్శించారు. యూనివర్సిటీల్లో అనేక సమస్యలు వేళ్ళూనుకు పోతున్నాయని తెలిపారు. అధ్యాపకులు, సిబ్బంది నియామకాలు లేవన్నారు. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఛార్జీలు సరిపోక విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద విద్యా వ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. విద్యారంగాన్ని నాశనం చేసే కుట్రతో వైసీపీ ప్రభుత్వం పాలన సాగిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తిరోగమన విద్యా విధానాలను రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు.