కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని వైసిపి అధినేత జగన్ గురువారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తిరుమల పవిత్రతను, ప్రసాదం విశిష్టతను చంద్రబాబు అపవిత్రం చేసినందుకుగానూ.. ఆ పాపం ప్రక్షాళన కోసం ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసిపి అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఈనెల 28వ తేదీ శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైసిపి కేడర్కు ఆయన పిలుపునిచ్చారు. అలాగే తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో జగన్ పాల్గొననున్నారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి ఆయన తిరుమలకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం వేంకటేశ్వరుడిని దర్శించుకోనున్నారు. అయితే తిరుమల పవిత్రతను, వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం విశిష్టతను, స్వామి వారి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను చంద్రబాబు తన రాజకీయ దుర్బుద్ధితో అపవిత్రం చేశారంటూ వైఎస్.జగన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా చిత్రీకరిస్తున్నారని, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.