జగన్ ప్రజాధనాన్ని లూటీ చేశారని పోలీసులకు టీడీపీ ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై పోలీసులకు ఫిర్యాదు అందింది. జగన్ ప్రజాధనాన్ని లూటీ చేశారని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్, టీడీపీ నేతలతో కలిసి గుంటూరు ఎస్పీ కార్యాలయంలో సీసీఎస్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందించారు. తన సొంత ఇంటి కోసం సీఎం క్యాంపు కార్యాలయం పేరుతో సుమారు రూ.45.54 కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజలు కట్టిన పన్నుల్ని సక్రమంగా వెచ్చించాల్సిందిపోయి ఇలా సొంత ఇంటి కోసం వాడుకున్నారని ఆరోపించారు నేతలు. బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వ్యక్తి.. తన సొంతింటికి ఫర్నిచర్, డిజిటల్ పరికరాల కోసం ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ సామాగ్రి మొత్తం బాధ్యతగా ప్రభుత్వానికి అప్పగించాలని.. ఇప్పటికీ సామాగ్రిని తిరిగి అప్పగించకుండా నేరం అన్నారు. ప్రభుత్వ ఆస్తులను వాడుకుంటున్న జగన్తోపాటు సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గతంలో జగన్ ప్రభుత్వం మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు విషయంలో ఏవిధంగా వ్యవహరించిందో.. ఇప్పుడు జగన్ విషయంలో కూడా కొత్త ప్రభుత్వం అదేవిధంగా వ్యవహరించాలన్నారు నేతలు. కోడెల కూడా ముందుగానే ఫర్నీచర్ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని.. ఇప్పుడు జగన్ మాత్రం మీడియా బయట పెట్టేవరకూ బయటకు చెప్పకుండా రహస్యంగా ఉంచారన్నారు. కోడెల మీద పెట్టిన కేసులోని సెక్షన్ల కంటే జగన్పై అదనపు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
టీడీపీ నేతల ఫిర్యాదు సంగతి ఇలా ఉంటే.. ఈ వివాదంపై వైఎస్సార్సీపీ స్పందించింది. మాజీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫర్నీచర్, ఇతర వివరాలు అందించాలని.. వివరాలు ఇస్తే వాటి ఖరీదు చెల్లించేందుకు తాము సిద్ధమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నీచర్కు విలువకట్టి.. ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే, అంతా చెల్లిస్తామని కోరడం జరిగిందన్నారు. తాము ప్రభుత్వంవైపు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. జగన్ లక్ష్యంగా చేస్తున్న దుష్ప్రచారం రాజకీయాల్లో దిగజారుడు తనమన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మంత్రులు కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు కావడం దురదృష్టకరం అన్నారు. ఇలాంటి చర్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలతో జగన్వ్యక్తిత్వాన్ని దెబ్బతీయలేరన్నారు.