పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1,050 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన మంత్రి.. యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఫోటో ప్రదర్శనను ఆయన తిలకించారు. అక్కడ నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నదుల అనుసంధానం ద్వారా మాత్రమే దేశాన్ని కరవు రహితంగా మార్చగలమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆ ప్రక్రియకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చని తెలిపారు.
పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనం చేయించడం చంద్రబాబు నాయుడు ముందుచూపునకు నిదర్శనం.. పోలవారం ప్రాజెక్ట్ ఆలస్యం జరుగుతుంది కాబట్టే పట్టసీమను చేపట్టారు.. దీని ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోంది.. గతంలో పట్టిసీమను మాజీ సీఎం జగన్ ఒట్టిసీమ అని ఎద్దేవా చేశారు.. కానీ, ఇప్పుడు అదే బంగారమైంది.. పట్టిసీమ పుణ్యమా అని కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుంది.. జగన్ పాలన అంతా విధ్వంసాలే.. తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. అని వ్యాఖ్యానించారు. పట్టిసీమ నుంచి నీళ్లు విడుదల చేయకపోతే లక్షలాది ప్రజల దాహార్తిని ఎలా తీరుస్తారు? ఒక్క చుక్క నీటినీ వృథా చేయొద్దని ముఖ్యమంత్రి చెప్పారు. తాడిపూడి నుంచి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం.. ఏలేరు రిజర్వాయర్లో నిల్వ వల్ల స్టీల్ ప్లాంట్, విశాఖ నగరానికి తాగునీరు అందుతుంది.. ఏలేరులో నీటి నిల్వకు ప్రయత్నిస్తున్నాం. ఒకే రోజు నాలుగు పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం చరిత్రాత్మకం… అధికారులతో సమన్వయం చేసుకుని నీటి నిర్వహణ సమర్థంగా చేపడుతున్నాం.. పోలవరం ఫలాలు పట్టిసీమ ద్వారా కొంతమేర కృష్ణా డెల్టాకు అందుతున్నాయి్ణ అని నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు అన్నారు. ఇక, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు అటు కృష్ణా డెల్టాలో వేలఎకరాలకు సాగునీరు అందుతుంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ద్వారా నీటి తరలింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. నాలుగేళ్లలో కేవలం 60 టీఎంసీలు వరకు మాత్రమే ఎత్తిపోశారు.