. మద్దతు ధరకు చట్టబద్ధత, రుణ విమోచన సాధించాలి
. రైతు ఉద్యమనేత అంజన్ సంస్మరణ సభలో వక్తల ఉద్ఘాటన
విశాలాంధ్ర`హైదరాబాద్: రైతులు పండిరచిన పంటలకు మద్దతుధర దక్కేలా చట్టబద్ధత కల్పించుకోవడంతో పాటు రుణ విమోచన సాధించుకోవడమే…అవిశ్రాంత రైతు ఉద్యమ నేత దివంగత అతుల్ కుమార్ అంజన్కు మనమిచ్చే ఘన నివాళి అవుతుందని రైతులు సంఘాల నాయకులు, వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్వర్యాన గురువారం హైదరాబాద్ బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో రైతు ఉద్యమ నేత దివంగత అతుల్ కుమార్ అంజన్ సంస్మరణ సభ నిర్వహించారు. ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు బాగం హేమంత్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రధాన వక్తగా ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు సోమ మర్ల, దొంతి నర్సింహారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్వపద్మతో పాటు ఆఫీస్ బేరర్లు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు. రావుల వెంకయ్య మాట్లాడుతూ… రైతు ఉద్యమ నాయకులు అతుల్ కుమార్ అంజన్ మరణం భారత రైతాంగంతో పాటు ఏఐకేఎస్కు తీరనిలోటు అన్నారు. ఔరంగాబాద్లో జరిగిన ఏఐకేఎస్ జాతీయ సభల సందర్భంగా అప్పటి అధ్యక్షులు చంద్రప్ప, ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్… ఏఐకేఎస్కు దేశ వ్యాప్తంగా కోటి మంది రైతుల సభ్యత్వంతో లక్ష గ్రామాల్లో శాఖల ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారన్నారు. మహా నాయకులు చేసిన ఈ ఆలోచనను ఏఐకేఎస్ సభ్యులుగా అందరం కలిసి కట్టుగా కృషి చేసి సాధించుకుందామని పిలుపునిచ్చారు. సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ… రైతుల సమస్యలను పరిష్కరించడంతో, ఆందుకు కావాల్సిన కార్యచరణను రూపొందించడంలో అతుల్ కుమార్ అంజన్ను మించిన నాయకుడు లేడని కొనియాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతుల ఐక్య ఉద్యమంలో అంజన్ పోషించిన క్రీయాశీలక పాత్ర మరువలేనిదన్నారు. దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సభ్యుల్లో ఒకరైన అతుల్ కుమార్ అంజన్… ఆ కమిటీ నివేదిక తయారీలో కీలక భూమిక వహించారని… రైతులకు ఎంతో మేలు చేసే అంశాలు పొందుపర్చేందుకు దోహదపడ్డారన్నారు8. దీనిని వివరించి చెప్పాల్సిన బాధ్యత ఏఐకేఎస్ నాయకులదే నన్నారు. ఒక ఎకరా వరి సాగు చేయాలంటే 2018లో రూ.34వేలుగా ఉన్న ఖర్చు… 2021 నాటికి రూ.44 వేలకు చేరిందని, అందుకు అనుగుణంగా మద్దతు ధర ఇవ్వకుండా పాలకులు సమ్మాన్ నిధ్, రైతు బంధు, రైతు భరోసా పేరుతో రైతులను మభ్యపెడుతూ… వారిని అప్పుల పాలు చేస్తున్నారన్నారు. సోమమర్ల మాట్లాడుతూ పెరిగిన ధరల సూచికలకు అనుగుణంగా రైతులకు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధర లభించినప్పుడే వారి జీవితాలు బాగుపడుతాయని, వీటిని సాధించేందుకు అంజన్ జీవితాంతం ఆవిశ్రాంతంగా ఉద్యమించారన్నారు. గతంలో కమ్యూనిస్టు పార్టీలు జరిపిన పోరాటాల కారణంగా చిన్న సన్నకారు రైతులకు కొంత భూమి దక్కిందని, భూ సంస్కరణలు పరిపూర్ణమైనప్పుడే భూ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మాట్లాడుతూ … అతుల్ కుమార్ అంజన్ విద్యార్థి, రైతు ఉద్యమ నేతగా తన జీవితాంతం అనేక పోరాటాల్లో కీలక భూమిక నిర్వహించిన మహా నాయకుడని కొనియాడారు. క్యాన్సర్ బారిన పడి 69 ఏళ్ల వయసులోనే భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ఏఐకేఎస్లో ప్రతి నాయకుడు ప్రతిన బూనాలన్నారు. ఈ సభలో తెలంగాణ రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కొప్పోజు సూర్య నారాయణ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు కొల్లూరి రాజయ్య, ప్రభులింగం, దొండపాటి రమేష్, కార్యదర్శులు కే గోవింద్, రాజిరెడ్డి, శంకరయ్య, దేవిదాస్, వార్ల వెంకటయ్య, రామకృష్ణ రెడ్డి, ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంద సదాలక్ష్మి పాల్గొన్నారు. 21 జిల్లాల నుండి రైతు సంఘం నాయకులు, మహిళ రైతులు, యువ రైతులు హాజరయ్యారు.