ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్లే ప్రజాదరణ కరవు
డీజీపీ గౌతం సవాంగ్ వెల్లడి
అమరావతి : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి, మరో ఐదుగురు అజ్ఞాత మావోయిస్టులు లొంగిపోయారు. మంగళగిరి పోలీస్ హెడ్క్వార్టర్స్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో డీజీపీ గౌతం సవాంగ్ ఈ విషయం తెలిపారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. వీరిలో కోరుకొండ ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్నచిక్కుడు చిన్నారావు ఎలియాస్ సుధీర్ 15 సంవత్సరాలుగా అజ్ఞాతంలో పనిచేస్తున్నారు. ఇతనిపై రూ.5లక్షల రివార్డ్, 93 కేసులు నమోదై ఉన్నాయి. వంతల పన్ను ఎలియాస్ మహితపై 5లక్షల రివార్డు, 93 కేసులున్నాయి. మడకం సోమిడిపై 4లక్షల రివార్డు, 10 కేసులు, మడకం మంగ్లుపై లక్ష రికార్డు, 9కేసులు, పోయం రుకినిపై లక్ష రివార్డు 3నేరాలు, సోడి భీమపై లక్ష రివార్డు 3 కేసులున్నాయి. ప్రజల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో, గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు మావోయిస్టు భావజాలం వైపు మళ్లడం లేదని, వారిని ఆదరించడం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ క్రమంలోనే గాజర్ల రవి అలియాస్ ఉదయ్, మరో ఐదుగురు మావోయిస్టులు పోలీసులకు లొంగిపోయినట్లుగా ఆయన వెల్లడిరచారు. దాదాపు మూడు లక్షల ఎకరాలను లక్షా 53వేల మందికి ప్రభుత్వం పంపిణీ చేసిందని, 19,919 కుటుంబాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిందన్నారు. గిరిజన ప్రాంతాలలో గతంలో ఉన్న భూ సమస్యలను ప్రభుత్వం చాలావరకు పరిష్కరించిందన్నారు. బాక్సైట్ తవ్వకాలను సైతం ప్రభుత్వమే నిషేధించడంతో గిరిజన ప్రాంతాల్లో సమస్యలు కనుమరుగయ్యా యన్నారు. దీంతో రెండేళ్లలో ఏఓబీలో మావోయిస్టు పార్టీ ఉద్యమం తీవ్ర మైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందని, ఫలితంగా గతంలో 140 మంది ఉన్న సంఖ్య 60కి తగ్గిపోయిందన్నారు. వారు కూడా విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యారని చెప్పారు. ఇన్ఫార్మర్ల పేరిట మావోయిస్టులు చేస్తున్న హత్యలు, వేధింపులు, మరోపక్క గతంలో వారు పరిష్కరించే సమస్యలను వలంటీర్ల వ్యవస్థ పరిష్కరిం చడం వల్ల మావో యిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రెండేళ్లలో మొత్తం 11సార్లు మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, వీటిలో డీసీఎంలతో సహా 14 మంది కీలక మావోయిస్టులు మృతి చెందగా, 32 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారని, మరో 6గురు అరెస్ట్ అయ్యారని డీజీపీ వివరించారు. మిగిలిన మావోయిస్టులు అజ్ఞాత పోరాటాలకు స్వస్తి పలికి లొంగిపోవడం ద్వారా జనజీవన స్రవంతిలో కలిసి పోవాలని, అటువంటివారికి ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.