ముంబై: గత ఏడాది జూన్ 22న శివసేనను చీల్చి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన తన వెంట 40 మంది శాసనసభ్యులను తీసుకెళ్లానని చెప్పారు. నిజానికి అప్పటికే 105 మంది సభ్యులతో బీజేపీ శాసనసభలో అతి పెద్ద పార్టీ. కానీ బీజేపీ అసలు లక్ష్యం ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని ప్రభుత్వాన్ని పడగొట్టడమే కనక తమ బలంలో సగమైనాలేని శివసేన వర్గం నాయకుడైన ఏక్ నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయడానికి అంగీకరించింది. మహారాష్ట్రలో బీజేపీ అగ్ర నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ అధిష్ఠానం మాటవిని ఉప ముఖ్యమంత్రి పదవితో రాజీపడక తప్పలేదు. ఇప్పుడు అజిత్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీకి చెందిన దాదాపు 40 మంది పార్టీ ఫిరాయించారు. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రి, మరో ఎనిమిది మంది మంత్రులై పోయారు. అందువల్ల షిండే సహాయం ఇక బీజేపీకి అక్కర్లేదు. ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి కట్టబెట్టడానికి ఒప్పుకోవడంవల్ల బీజేపీ శివసేనను చీల్చే అసలు లక్ష్యం సాధించేసింది. ఇప్పుడు ఎన్సీపీని చీల్చింది.
ఇక షిండేతో పనేముంటుంది?
ఏక్నాథ్ షిండే అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఆయన వర్గంలోని వారు మంత్రిపదవుల మీద ఆశ పెంచుకున్నారు. ఇప్పుడు అజిత్ పవార్ వర్గం మద్దతు ఉంది కనక షిండే మద్దతుదార్లకు పదవులు ఇవ్వకుండా ఉన్నా చేయగలిగింది ఏమీ లేదు. అంటే అజిత్ పవార్ వర్గం ప్రభుత్వంలో చేరడంతో షిండే వర్గానికే ప్రమాదం పొంచి ఉందనుకోవాలి. తన వర్గానికి మంత్రిపదవులు ఇప్పించడం ఇక సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు ఆయన మద్దతుదార్లు ఆయనతో కొనసాగకపోవచ్చు. కొద్ది రోజుల ముందే షిండే ప్రభుత్వానికి ఏడాది నిండిరది కనక ఆయన అనుయాయులకు మంత్రిపదవులు దక్కుతాయనుకున్నారు. కానీ అజిత్ పవార్ వచ్చి చేరడంతో ఇక ఆ అవకాశం ఉండకపోవచ్చు. మరో వేపు అజిత్ పవార్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసిందన్న సమాచారం అందుతోంది. అప్పుడైనా షిండేకు ఉద్వాసన తప్పదు. అజిత్ పవార్ వెంటబెట్టుకొచ్చిన 40 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి అంత ప్రధానం కాదు. వారిలో ఎన్సీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ నరహరి జిహ్వల్, శాసనమండలి అధ్యక్షుడు రాం రాజ్ నింబాల్కర్, ఎన్సీపీ కోశాధికారి సునీల్ తట్కర్ లాంటి దిగ్దంతలు ఉన్నారు. సునీల్ తట్కరే ఎంపీ. ఆయన కూతురు అదితి తట్కరే నిన్ననే మంత్రి అయిపోయారు.
షిండే స్థానంలో అజిత్ పవార్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ అంటున్నారు. దీనికి తోడు షిండే వర్గం శాసనసభ్యులందరినీ అనర్హులుగా ప్రకటించే ప్రమాడం ఇంకా ఉండనే ఉంది. బీజేపీ నాయకుడు, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కన్నా తనకే ఎక్కువ జనాదరణ ఉంది అని షిండే ప్రచారం చేసుకోవడం, ఈ మేరకు దేశంలో మోదీ, మహరాష్ట్రలో షిండే అని పోస్టరు పత్రికల్లో వ్యాపార ప్రకటనలు వేయించడం కూడా బీజేపీకి ఆగ్రహం తెప్పించే అంశాలే.