. ఆహారావసరాలకు కొనుగోళ్లు నిలిపివేత
. ఇథనాల్ ఉత్పత్తికి ధాన్యం కేటాయింపులు
. ధరలోనే భారీ వ్యత్యాసం
న్యూదిల్లీ: తినడానికి తిండి లేదుగానీ మీసాలకు సంపెంగ నూనె చందంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలున్నాయి. ఆహార అవసరాలను తీర్చేందుకు ఎఫ్సీఐ నుంచి ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రాలకు షరతులు విధిస్తూ ఇథనాల్ తయారీ కోసం బియ్యం కేటాయించడం అవివేకమైన చర్యంటే అతిశయోక్తి కాదు. కర్నాటకలో బీపీఎల్ కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి 10కిలోల బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అన్నభాగ్య పథకం అమలుకు సిద్ధమైంది. భారత ఫుడ్ కార్పొరేషన్ (ఎఫ్సీఐ)కి క్వింటాకు రూ.3,400 వరకు చెల్లించేందుకు అంగీకరించింది. ఇంతలోనే కేంద్రం తాజా ఉత్తర్వులు జారీ చేయడంతో అన్నభాగ్య అమలునకు ఆటంకం కలిగింది. బహిరంగ మార్కెట్ విక్రయ పథకం (ఓఎంఎస్ ఎస్) కింద రాష్ట్ర ప్రభుత్వాలకు గోదుమలు, బియ్యాన్ని ఇవ్వవద్దని కేంద్రం ఈనెల 13న ఆదేశాలిచ్చింది. అలాగే వ్యక్తిగత బిడ్డర్లకు ఇచ్చే పరిణామాన్ని తగ్గించాలని సూచించింది. ఫలితంగా ఓఎంఎస్ఎస్ కింద కర్నాటకకు బియ్యం విక్రయించలేమని ఎఫ్సీఐ తేల్చిచెప్పింది. ఆహార ద్రవ్యోల్బణం దృష్ట్యా కేంద్రం ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది, భవిష్యత్ ట్రేడిరగ్ను నిషేధించింది. నిల్వ పరిమితులు విధించింది. మరోవైపు పెట్రోల్లో కలిపేందుకు ఇథనాల్ తయారీకి బియ్యం సేకరణ కొనసాగిస్తోంది. ఇలా సేకరించే బియ్యానికి క్వింటాకు రూ.2వేలు చొప్పున చెల్లించాలి. బియ్యం కొనుగోళ్లకు వీల్లేదని రాష్ట్రాలకు చెప్పి ఇథనాల్ కోసం కేటాయింపులు కొనసాగించడం మంచి విధానం కాబోదు.
జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం దేశంలో అర్హులైన 81.3 కోట్ల మంది లబ్ధిదారులకు 60 మిలియన్ టన్నుల మేర బియ్యం, గోదుమలను కేంప్రప్రభుత్వం అంద జేయాలి. ఇందుకు అవసరమైన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం సేకరించి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అర్హులకు చేరుస్తుంది. కొన్నేళ్లుగా ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్), సంక్షేమ పథ కాలకు అవసరమున్న దాని కంటే ఎక్కువగా ఆహార ధాన్యాల సేకరణ జరుగుతోంది. జూన్ ఒకటో తేదీ నాటికి 41.4 మిలియన్ టన్నుల ధాన్యం, 31.4 మిలియన్ టన్నుల గోదుమల సేకరించగా 2016లో ఉన్న నిల్వల కంటే ప్రస్తుతం గోదుమ నిల్వ తగ్గింది.
ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూ ఆహార ధరలను పర్యవేక్షిం చడం ఓఎంఎస్ఎస్ పని. సెంట్రల్పూల్లో అదనపు నిల్వలను ఎఫ్సీఐ విక్రయించవచ్చుగానీ దీనిని కేంద్రమే నిర్ణయిస్తుంది. బఫర్ కంటే సెంట్రల్ పూల్ నిల్వలు ఎక్కువ ఉంటే అదనపు నిల్వలను తగ్గించేందుకూ ఓఎంఎస్ఎస్ వినియోగమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ఎఫ్ఎస్ఏ కింద కేటాయించిన ఆహార ధాన్యానికి చెల్లించిన దానికంటే ఎక్కువ ధరకు ధాన్యాన్ని ఓఎంఎస్ఎస్ కింద రాష్ట్రాలు కొనుగోలు చేయడాన్ని కేంద్రం స్వాగతిస్తుంది. ఉదాహరణకు జనవరి నుంచి మే వరకు ఓఎంఎస్ఎస్ కింద క్వింటాకు రూ.3,400 చొప్పున చెల్లించి 1.16 లక్షల టన్నుల ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోగా అందులో కర్నాటక ఒక్కటే 1.12లక్ష టన్నుల బియ్యం కొనుగోలు చేసింది.
ఇక ఇథనాల్ విషయానికొస్తే భారత్లో ఇంధన అవసరాల్లో 86శాతం దిగుమతుల ద్వారా తీరుతాయి. దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు ఇథనాల్ ఉత్పత్తి, బ్లెండిరగ్ మిషన్ను కేంద్రం పరుగులు పెట్టిస్తోంది. దేశీయంగా ఇథనాల్ తయారు చేయాలంటే చెరకు, మొక్కజొన్న, ధాన్యం పంటలు కీలకం. ఇథనాల్ ఉత్పత్తి కోసం ఎఫ్సీఐ ద్వారా ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం కేటాయిస్తుంది. సగటు రకానికి చెందిన బియ్యం నిల్వలను దేశంలోని ఇథనాల్ తయారీ డిస్టిలరీలకు తరలిస్తారు. ఇథనాల్ కోసం సేకరించే బియ్యం క్వింటా ధరను రూ.2వేలుగా కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఓఎంఎస్ఎస్ కింద కొనుగోలు చేసే బియ్యం ధర కంటే ఇది చాలా తక్కువ. నీతిఆయోగ్ నిపుణుల కమిటీ రూపొందించిన భారత్లో ఇథనాల్ బ్లెండిరగ్ కార్యాచరణ 202025 ఆధారంగా ఇథనాల్ కోసం బియ్యం కేటాయింపులు జరుగుతాయి. 2025
26 నాటికి ఇథనాల్ను పెట్రోల్లో 20శాతం కలిపేందుకు 10.16బిలియన్ లీటర్ల ఇథనాల్ అవసరం. ఈ డిమాండును తీర్చేందుకు 45శాతాన్ని అంటే 4.66 బిలియన్ లీటర్లను ఎఫ్సీఐ లేదా బహిరంగ మార్కెట్ ద్వారా సేకరించే ధాన్యం ద్వారా తీర్చాలన్న అంచనా ఉంది. పాటబుల్ ఆల్కహాల్, ఫార్మా పరిశ్రమ కోసం 3.34 బిలియన్ లీటర్ల అవసరం ఉండగా ఇందులో రెండు బిలియన్ లీటర్లను ఆహార ధాన్యాల ద్వారా తీర్చాలని నితీ ఆయోగ్ నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఏటా సెంట్రల్ పూల్లో 30.9 మిలియన్ టన్నుల ధాన్యం అదనంగా ఉంటుంది. ఓఎంఎస్ఎస్ కింద రాష్ట్రాలకు బియ్యం కేటాయింపులను కేంద్రం నిలిపివేయడం ద్వారా నీతి ఆయోగ్ లెక్కకు మించి అంచనాలు వేసిందని తెలుస్తోంది. అయినప్పటికీ ఎఫ్సీఐ సెంట్రల్ పూల్ నిల్వల నుంచి ఇథనాల్ కోసం ధాన్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. 2021`22 (డిసెంబరు నుంచి నవంబరు వరకు) 1.06 మిలియన్ టన్నుల ధాన్యాన్ని డిస్టిలరీలకు ఎఫ్సీఐ విక్రయించింది. ఈ ఏడాది కేటాయింపు 1.5 మిలియన్ టన్నులు. అయితే బియ్యాన్ని ఇంధన వినియోగం కోసం కంటే ఆహారంగా వినియోగించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం. ఆహార అవసరాల కోసం ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్రాలను కట్టడి చేసినప్పుడు ఇథనాల్ ఉత్పత్తి కోసం ముడిసరుకుగా బియ్యం వినియోగాన్ని అనుమతించడం అవివేకమే అవుతుంది.