. 172 మంది ఎమ్మెల్యేల హాజరు
. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ప్రమాణం
. అనంతరం మంత్రులు… జగన్మోహన్ రెడ్డి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముగ్గురు మినహా మొత్తం 172 మంది శాసనసభ సభ్యులు హాజరయ్యారు. తొలుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. అనంతరం మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీసీ జనార్దన్రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేశ్, ఎన్ఎండీ ఫరూక్, పొంగూరు నారాయణ, కొలుసు పార్థసారథి, ఆనం రామనారాయణరెడ్డి, రామ్ప్రసాద్రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, వాసంసెట్టి సుభాష్ తదితరులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. శాసనసభ్యుల పేర్లుతో కూడిన అక్షర క్రమంతో ప్రమాణ స్వీకారం చేసే జాబితా ప్రకారం జగన్ సభలోకి ప్రవేశించి, ప్రమాణం చేసిన అనంతరం తన ఛాంబర్కు వెళ్లిపోయారు. అంతకుముందు అసెంబ్లీ వెనుక గేటు నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా ఆయన లోపలికి వెంటనే వెళ్లలేదు. తన ప్రమాణస్వీకార సమయం వచ్చినపుడే సభలో జగన్ అడుగుపెట్టారు. ఇక ఇతరత్రా కారణాలతో శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ, జీవీ ఆంజనేయులు గైర్హాజరయ్యారు. వీరు ముగ్గురూ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
శపథం నెరవేర్చుకున్న చంద్రబాబు
వైసీపీ శాసనసభ్యులు తీవ్రంగా కించపరచడంతో సీఎంగానే మళ్లీ అడుగుపెడతానని 2021లో శపథం చేసిన చంద్రబాబు… రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రిగానే ఆయన శుక్రవారం మరలా తొలిసారి సభలో అడుగుపెట్టారు. తొలుత అసెంబ్లీ మెట్ల వద్ద ప్రణమిల్లి చంద్రబాబు లోపలికి అడుగుపెట్టారు. అనంతరం శాసనసభాపక్ష నేత కార్యాలయంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందచేశారు. చంద్రబాబు సభలోకి అడుగుపెట్టగానే కూటమి సభ్యులంతా ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ నినాదాలు చేశారు. అదే నినాదంతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. సీఎం చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
గతంలో చంద్రబాబు చేసిన శపథమిదీ..
తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అసెంబ్లీలో అప్పటి మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైసీపీ సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన నాటి సీఎం జగన్ వెకిలి నవ్వులతో ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు. ‘ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం’ అని 2021 నవంబరు 19న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమానభారంతో భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. ప్రజాక్షేత్రంలోనే వైసీపీ ప్రభుత్వంపై పోరాడి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెట్టారు.