. పూలవర్షం కురిపిస్తూ అమరావతి రైతులు, మహిళల స్వాగతం
. సీఎంగా సచివాలయానికి…
విశాలాంధ్ర`తుళ్లూరు : రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించేందుకు గురువారం సచివాలయానికి వెళ్తున్న చంద్రబాబుకు అమరావతి రైతులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూల వర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి దీవించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంలో భారీ పూలదండలతో ఆయనకు స్వాగతం పలికారు. వారిని చూసిన చంద్రబాబు తన కాన్వాయ్ నుంచి దిగి రైతులకు అభివాదం చేశారు. వారిని ఆప్యాయంగా పలుకరించారు. సీఎం ప్రయాణించే రోడ్డుమార్గం మొత్తం అమరావతి రైతులు పూలతో నింపేశారు. సీడ్ యాక్సెస్, మందడం, వెలగపూడి రోడ్ల మీదుగా సచివాలయం వరకు రకరకాల పూలతో రహదారులు నిండిపోయాయి. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తర్వాత ఆందోళన ప్రారంభిం చిన రైతులు దాదాపు 1,631 రోజుల తర్వాత దీక్షలు బుధవారం విరమించారు. ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నిక కాగానే చంద్రబాబు మన రాజధాని అమరావతే అని ప్రకటించడంతో రైతులు తమ ఆందోళనకు ముగింపు పలికి సంబరాలు చేసుకు న్నారు. ఐదేళ్ల తర్వాత అమరావతి అభివృద్ధికి అడుగులు పడనుండడంతో చిన్నా, పెద్దా తేడాలేకుండా 29 గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో రోడ్డుకిరువైపులా నిలబడి పెద్దఎత్తున బాణసంచా కాలుస్తూ చంద్ర బాబుకు స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొనడంతో మందడంలో భారీ జన సందోహం నెలకొంది. పూలతో రోడ్లన్నీ పసుపుమయంగా మారాయి. ఓ రైతు అందజేసిన ఆకుపచ్చని కండువాను చంద్రబాబు మెడలోవేసుకొని రైతులకు అభివాదం చేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై చంద్రబాబును అనుసరించారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రైతుల ఆనందోత్సాహాల్లో పాల్గొన్నారు. సచివాలయంలో కూడా ఉద్యోగులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు.