జైలు నుంచి బయటకు వచ్చిన సాయిబాబా
నాగ్పుర్ : దారుణ పరిస్థితుల మధ్య జైలు జీవితం అనుభవించాననీ, చివరకు సజీవంగా బయటకు రావడం ఆశ్చర్యంగా ఉందని దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా పేర్కొన్నారు. మావోయిస్టులతో సంబంధమున్న కేసులో నిర్దోషిగా తేలి, గురువారం జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యంత దారుణ, కఠిన పరిస్థితుల మధ్య ఎనిమిదేళ్ల జైలు జీవితం
గడిపానని అన్నారు. ‘వీల్ఛైర్ నుంచి బయటకు కదలలేకపోయా. సొంతగా టాయిలెట్కీ వెళ్లలేకపోయా. కనీసం పైకి లేచే పరిస్థితి లేదు. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. జీవితం ముందుకు సాగడం కష్టమనిపించింది. కానీ, ఈరోజు సజీవంగా బయటకు రావడం నిజంగా ఆశ్చర్యమే’ అని సాయిబాబా చెప్పారు. తనపై పెట్టిన కేసు కల్పితమైందన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన ఆరోగ్యం ఎంతో క్షీణించిందని, ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనన్నారు. మీడియా, న్యాయవాదుల విజ్ఞప్తితో మనసు మార్చుకుని జైల్లో తాను అనుభవించిన వేదనను వివరించారు. ఇదే విషయంపై సాయిబాబా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… వాస్తవాలు లేవని రెండుసార్లు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసినప్పటికీ ఈ కేసును ఎందుకు ఇంతకాలం సాగదీశారని ప్రశ్నించారు. పదేళ్ల జీవితం వృథా అయిందని, దాన్ని ఎవరు తిరిగి తెచ్చిస్తారని అన్నారు.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న కేసులో ఆయన నిర్దోషి అని బాంబే హైకోర్టు రెండు రోజుల క్రితం తీర్పునివ్వడంతో గురువారం ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. సాయిబాబా కేసును మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని ట్రయల్ కోర్టు అప్పట్లో విచారణ జరిపిన విషయం తెలిసిందే.