సమావేశాలకు ప్రతిపక్ష నేతలు సహకరించాలి
బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ పిలుపు
నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడుతూ,. ఇది దేశాభివృద్ధికి కీలక సమయమని అన్నారు. సమావేశాలకు ప్రతిపక్ష నేతలు సహకరించాలని కోరారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో మన దేశానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మన దేశం ఆర్థికంగా పుంజుకోవడం, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగించడం, భారత్లో తయారైన కరోనా వ్యాక్సిన్లు వంటి అంశాలు మన దేశంపై ప్రపంచ దేశాల నమ్మకాన్ని పెంచుతోందని అన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు బడ్జెట్ సమావేశాలకు ఇబ్బందికరమే అయినప్పటిక ఎంపీలందరూ సమావేశాలకు హాజరుకావాలని తాను కోరుతున్నానని ప్రధాని చెప్పారు. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ సమావేశాలు ఓ బ్లూప్రింట్ను రూపొందిస్తాయని తెలిపారు. ఈ సమావేశాలను మనం ఎంతగా ఉపయోగించుకుంటే ఫలితాలు అంత బాగా ఉంటాయని చెప్పారు. అందరం కలసి మన దేశాన్ని ఆర్థికంగా అత్యున్నత శిఖరాలకు చేరుద్దామని పిలుపునిచ్చారు. ఎంపీలందరూ ఓపెన్ మైండ్తో సమావేశాలకు రావాలని కోరారు.