విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఎన్డీఏ కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) అధికారంలోకి వచ్చాక తొలిసారిగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.46కు శాసనసభ ప్రారంభం కానుంది. శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు ఈ సభా కార్యక్రమాలు కొనసాగుతాయి. కూటమి తరపున ఎన్నికైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం, అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకుగాను కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందారు. వైసీపీ నుంచి 11 మంది విజయం సాధించారు. తొలుత సీఎం చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో ప్రమాణం చేస్తారు. వైసీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోవడంతో జగన్ సాధారణ ఎమ్మెల్యే స్థాయిలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎన్నుకుంటారు. ఇప్పటికే సచివాలయంలో శాఖాపరంగా మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. ఇందులో 17 మంది కొత్తగా మంత్రిపదవులు పొందినవారున్నారు. శాసనసభ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.