5 వరకు చర్యలొద్దని హైకోర్టు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉండి… ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. జూన్ 5వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిపై మొత్తం 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం పిన్నెల్లి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో లంచ్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. పిన్నెల్లికి ముందుగా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం తగదని ఆయన తరపు న్యాయవాది నిరంజన్రెడ్డి వాదించారు. ‘ఎక్స్’లో నారా లోకేశ్ ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు వెళ్లడం సరికాదు. లోకేశ్ ట్విట్టర్ లో పెట్టిన వీడియో ఆధారంగా పిన్నెల్లిని అరెస్ట్ చేయడం అన్యాయమని వాదించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని పోలింగ్ అధికారి చెప్పారని… పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కూడా ఇవే అంశాలు ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న నారా లోకేశ్ ట్విట్టర్లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు అయినప్పటికీ పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వవచ్చునన్నారు. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41ఏ నోటీసులు ఇవ్వాలని ఉందని గుర్తు చేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ క్రమంలో పిన్నెల్లిపై జూన్ 5వరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు జడ్జి జ్యోతిర్మయి ఆదేశాలిచ్చారు.
రీపోలింగ్ పిటిషన్లు డిస్మిస్
రీపోలింగ్ జరపాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు, చంద్రగిరి వైకాపా అభ్యర్థి మోహిత్రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన రెండు పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. పోలింగ్ రోజు హింసాత్మక ఘటనల నేపథ్యంలో సత్తెనపల్లిలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని మంత్రి అంబటి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరో వైపు తిరుపతి జిల్లా చంద్రగిరిలో రీపోలింగ్ నిర్వహించాలని మోహిత్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.