. సవరించిన అంచనాలకు కేంద్రం ఓకే
. మోదీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు
. ప్రధానితో చర్చలు ఫలవంతమంటూ ట్వీట్
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఇక పరుగులు పెట్టనుంది. కొన్ని సంవత్సరాలుగా ప్రాజెక్టు అంచనా వ్యయం పెం పుపై కేంద్రం ఊగిసలాడి ధోరణి కొనసాగుతున్న వేళ... రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీకి పోలవరం, అమరావతి రాజధాని ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రధాని కూడా హామీ ఇచ్చారు. దీంతో పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి మోదీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి దిల్లీ వెళ్లిన చంద్రబాబు... మోదీతో గంటకు పైగా సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన, సెయిల్లో విశాఖ స్టీల్ విలీనం, వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి సాయం తదితర అంశాలను చర్చించినట్లు తెలిసింది. పెండిరగ్లో ఉన్న విభజన హామీలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు అధ్వర్యాన రూ.15 వేల కోట్ల నిధులు ఆర్థిక సహాయం చేయడం, పోలవరానికి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపడం, వరద బాధితులకు సహాయం అందించడం పట్ల ప్రధానికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానితో భేటీ అయిన తదుపరి చంద్రబాబు ఎక్స్ వేదికగా తన స్పందన తెలిపారు. మోదీతో చర్చలు ఫలవంతగా జరిగాయని వెల్లడిరచారు. పోలవరం సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొనే విషయంలో కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అమరావతి రాజధానికి ప్రధానమంత్రి అందిస్తున్న మద్దతును అభినందిస్తున్నానంటూ చంద్రబాబు ఎక్స్లో పేర్కొన్నారు. ప్రధాని, చంద్రబాబు మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అనంతరం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ రైల్వేజోన్ ప్రారంభానికి ముహూర్తంపై చర్చించారు. సోమవారం రాత్రికి దిల్లీలోనే బస చేయనున్న సీఎం... మంగళవారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ కానున్నారు. అమరావతి రాజధాని ఔటర్రింగ్రోడ్డు, అమరావతి
అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే, విజయవాడ నుంచి నిడమానూరు వరకు ప్లై ఓవర్ కొనసాగింపు తదితర కీలక ప్రాజెక్టులపై ఆయనతో చంద్రబాబు చర్చించనున్నారు.