కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు
విశాలాంధ్ర – కడప కలెక్టరేట్ : కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలతో నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్, చెల్లెలు సునీతారెడ్డి, ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల విలేకరులతో మాట్లాడుతూ కడప ప్రజలు మంచి తీర్పు ఇస్తారని, భారీ మెజార్టీతో గెలుస్తానన్న దృఢ నమ్మకం ఉందని తెలిపారు. అనంతరం ఇడుపులపాయ నుంచి కడప నగరానికి చేరుకుని ఐటీఐ సర్కిల్ నుంచి నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో సునీతారెడ్డి, తులసిరెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకున్న షర్మిల తన నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.జయరామరాజుకు అందజేశారు. డీసీసీ కార్యాలయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. తన పోటీ న్యాయం కోసమేనని, ప్రజలు న్యాయం వైపున, నేరం వైపునా అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డి దోషి అని సీబీఐ చెప్పిందని, సాక్ష్యాధారాలు చూపిస్తుంటే జగన్ రెడ్డి నిందితులను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఓబులేసు మాట్లాడుతూ ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’ కూటమిని గెలిపించాలని కోరారు. సీఎం జగన్ మరోసారి విజయం సాధించాలని సింగిల్గా సిద్ధమై వస్తున్నానని ప్రజలకు చెబుతున్నారని, కానీ సింగిల్గా ఉండే సింహం ఎప్పుడూ అడవిలోనే ఉంటుందని… జగన్ను ప్రజలు ఒప్పుకోరని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మతోన్మాద బీజేపీ పంచన చేరారని, వారు కూడా అడ్రస్ లేకుండా పోతారని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి దిశగా పరుగులు పెట్టాలంటే షర్మిలమ్మను కడప నుంచి అత్యధిక మెజారిటీతో పార్లమెంటుకు పంపాలన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్, వామపక్షాలయిన సీపీఐ, సీపీఎం అభ్యర్థులకు ఓట్లు వేసి ఈ దుష్ట పాలనకు చరమగీతం పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జి.చంద్ర, సిహెచ్ చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటశివ, ఉభయ కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న అఫ్జల్ఖాన్
నగర ప్రముఖుడు, వైసీపీ రాష్ట్ర నాయకుడు అఫ్జల్ఖాన్ ఆ పార్టీని వీడి వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో ఎంతో ఉత్సాహంతో పార్టీకి పని చేశానని, తిరిగి సొంత గూటికి చేరానన్నారు. కడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వైఎస్ షర్మిల విజయం కోసం కృషి చేస్తానని వెల్లడిరచారు.