న్యూదిల్లీ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఛైర్మన్ మనోజ్ సోనీ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడిరచాయి. గతేడాది ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టిన ఆయన… ఇంకా ఐదేళ్ల పదవీకాలం ఉండగానే అనూహ్యంగా రాజీనామా చేయడం అనుమానాలకు తావిస్తోంది. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ వివాదం వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ వివాదంతో మనోజ్ సోనీ రాజీనామాకు ఎటువంటి సంబంధం లేదని అధికారిక వర్గాలు వెల్లడిరచాయి. దాదాపు పదిహేను రోజుల క్రితమే ఆయన తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించినట్లు పేర్కొన్నాయి. అయితే, రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిపాయి. 2017లో యూపీఎస్సీ కమిషన్లో సభ్యుడిగా చేరి గతేడాది మే నెలలో ఛైర్మన్గా సోనీ ప్రమాణస్వీకారం చేశారు. 2029 మే 15 వరకు ఆయన పదవీకాలం ఉంది. అయితే, ఛైర్మన్ పదవి చేపట్టడానికి ఆయన ముందునుంచి సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది. తనను ఈ బాధ్యతల నుంచి తప్పించాలని గతంలోనే ఓసారి అభ్యర్థించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
ఇకపై, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలని సోనీ కోరుకుంటున్నట్లు తెలిపాయి. యూపీఎస్సీ ఛైర్మన్ పదవికి ముందు ఆయన గుజరాత్లోని డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వరుసగా రెండుసార్లు వీసీగా సేవలందించారు. అఖిలభారత సర్వీసులైన ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్ సర్వీసెస్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.