. అడుగడుగునా ఆంక్షలు
. దిల్లీలో నెలరోజులు 144 సెక్షన్
. సరిహద్దుల మూసివేత
న్యూదిల్లీ :అన్నదాతలపై కేంద్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. రైతుల ఆందోళనలను ఉక్కుపాదంత అణచివేస్తోంది. రైతుల దిల్లీ చలో కార్యక్రమాన్ని అడ్డుకునేందుకుగాను నెల రోజులపాటు దేశరాజధానిలో 144 సెక్షన్ విధిస్తూ సోమవారం దిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ‘దిల్లీ చలో’ పేరుతో ఆందోళన చేపట్టాలని రైతులు నిర్ణయించడంతో ఈ ఆంక్షలు విధించారు. నగరంలో ట్రాక్టర్ల ప్రవేశానికి అనుమతి ఉండదని వెల్లడిరచారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్, సోడా బాటిళ్ల వంటి వాటిని వెంట తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. లౌడ్ స్పీకర్ల వాడకంపైనా ఆంక్షలు వర్తిస్తాయని తెలిపారు. ‘దిల్లీ చలో’ ఆందోళనలో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేలమంది రైతులు దిల్లీకి వచ్చే అవకాశాలున్నాయని నిఘావర్గాలు అంచనా వేశాయి. ఈ ఆందోళనను ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు 40 సార్లు రిహార్సల్ నిర్వహించాయని, అందులో పంజాబ్లో 30, హరియాణాలో 10 జరిగాయని తెలిపాయి. 2,000-2,500 ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్నాటకల నుంచి కర్షకులు కార్లు, ద్విచక్రవాహనాలు, మెట్రో, రైళ్లు, బస్సుల ద్వారా దిల్లీకి చేరుకుంటారని తెలిపాయి. దాంతో హరియాణా, దిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనేకచోట్ల సరిహద్దులను మూసివేసి… భారీగా బలగాలు మోహరించారు. పంజాబ్తో తమ రాష్ట్ర సరిహద్దును అంబాలా సమీపంలోని శంభు వద్ద హరియాణా పోలీసులు మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలు అడ్డుగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలు నిలిపి ఉంచారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే దిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో అనేకచోట్ల 144 సెక్షన్ విధించారు. ఇదిలా ఉంటే… ముగ్గురు కేంద్రమంత్రులతో కూడిన బృందం రైతు ప్రతినిధులతో రెండోసారి చర్చలు జరపనుంది. దానిలో భాగంగా పీయూశ్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్ చండీగఢ్లో వారితో చర్చించనున్నారు. ఫిబ్రవరి ఎనిమిదిన రెండు వర్గాల మధ్య ఒకసారి భేటీ జరిగింది. దిల్లీ మార్చ్ కోసం ఇప్పటికే పంజాబ్లోని అనేక గ్రామాల నుంచి ట్రాక్టర్లు బయలుదేరాయి.