. ఇప్పటి వరకు అదే కొనసాగిన వైనం
. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాని దుస్థితి
. 19 మంది వీసీల రాజీనామా కోరిన కొత్త ప్రభుత్వం
. నూతన సంప్రదాయమూ చర్చనీయాంశమే
విశాలాంధ్ర – విశాఖ సిటీ : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు రాజకీయ కేంద్రాలుగా మారడంపై వామపక్ష పార్టీలతో సహా విపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో దుయ్యబట్టాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రాజకీయ జోక్యాలు తారస్థాయికి చేరాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగాయి. ఫలితంగా విద్యా వ్యవస్థలో కీలక కేంద్రాలుగా ఉన్న విశ్వవిద్యాలయాలు మెరుగైన విద్యనందిం చడం కంటే రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమైంది. దీంతో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పాటు వర్సిటీల్లో పాలనా వ్యవస్థ గాడి తప్పినట్లు స్పష్టమైంది. అయితే ఇప్పుడు విశ్వవిద్యాలయాల వ్యవస్థలో మరో కలకలం చెలరేగింది. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలోని పెద్దలు… విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు (వీసీలు) ను రాజీనామా చేయాలంటూ ఒక కొత్త సంప్రదాయానికి తెర తీశారు. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వారిని నామినేటెడ్ పోస్టులో నియమిం చడం, ఒకవేళ అధికార మార్పిడి జరిగితే ఆయా పదవులు పొందిన వారు రాజీనామా చేయడం లేదా ప్రభుత్వమే వారిని రాజీనామా చేయమని కోరడం సాధారణంగా జరిగేది. దీనికి భిన్నంగా ఆంధ్ర ప్రదేశ్లో ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీస్తూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలను కూడా రాజీనామా చేయమని అడిగి తెలుగుదేశం ప్రభుత్వం విద్యా వర్గాల్లో సంచలనం రేపింది. గతంలో ఒకరు ఇద్దరో వారే స్వయంగా రాజీనామా చేయడమో, లేదా ప్రభుత్వమే రాజీనామా కోరడం జరిగింది. అది కూడా చాలా అరుదుగా చాలా తక్కువసార్లు మాత్రమే రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి. కానీ ఈసారి గత ప్రభుత్వంలో నియమితులైన వీసీలు అందరినీ రాజీనామా కోరడం చర్చనీయాంశమైంది. గతంలో ఒక పార్టీ అధికారంలో ఉండగా విశ్వవిద్యాల యాలకు ఎంపికయిన వైస్ ఛాన్స్లర్లు అధికార మార్పిడి జరిగే వరకు కొనసాగేవారు. గవర్నర్ నియామకం కావడంతో తదుపరి వేరే పార్టీ అధికారం లోకి వచ్చినప్పటికీ అదే వైస్ ఛాన్స్లర్ పదవీకాలం ముగిసే వరకు కొనసాగే వారు. కానీ ఈ పద్ధతికి స్వస్తి పలుకుతూ తొలిసారిగా వైసీపీ అధికారంలో ఉండగా జగన్ ప్రభుత్వం నియమించిన వీసీలను తక్షణమే రాజీనామా చేయమని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కోరడం సంచలనం అయింది. ఆయ విశ్వవిద్యాల యాల వీసీలు గత వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారని, అందువలన వారిని తొలగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మంత్రులు సమర్ధించుకున్నప్పటికీ ఈ నిర్ణయం వివాదాస్పమై నదేనని విద్యా వ్యవస్థకు చెందిన మేధావులు మండిపడుతున్నారు. ఇదే సాంప్రదాయం భవిష్యత్లో కూడా కొనసాగితే ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే వారి పార్టీ సానుభూతిపరులు మాత్రమే వీసీలుగా నియమితులవుతారని, దీంతో ఉన్నత విద్య గాడి తప్పుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతే కాకుండా ఇప్పటివరకు పరోక్షంగా విశ్వవిద్యా లయాలపై రాజకీయ నాయకుల జోక్యం ఉంటే, భవిష్యత్తులో పూర్తిగా రాజకీయ నాయకుల కనుసనల్లోనే విశ్వవిద్యాల యాలు నడిచే అవకాశం ఉందని అంటున్నారు.
ఏయూ వీసీ రాజీనామా
ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఉన్నత విద్యాశాఖ అధికారులు గురువారం వీసికి ఫోన్ చేసి రాజీనామా కోరినట్టు తెలిసింది. మరో మారు శుక్రవారం మధ్యాహ్నం కూడా ఉన్నత విద్యాశాఖ నుంచి ఫోన్ రావడంతో ఆచార్య ప్రసాద రెడ్డి వీసీ పదవికి వెంటనే రాజీనామా చేశారు. ఆచార్య ప్రసాద రెడ్డి 2019లో ఏయూ ఇన్ఛార్జ్ వీసీగా నియమితులై ఏడాదిన్నర కాలం తర్వాత పూర్తిస్థాయి వీసీగా బాధ్యతలు చేపట్టారు. మూడేళ్ల పదవీకాలం తర్వాత ఈ ఏడాది జనవరిలో మరల మరోమారు వీసీగా అవకాశం దక్కింది. ఇదిలా ఉండగా ఆయన వైసీపీకి అనుకూలంగా ఉండడం, క్రియాశీలకంగా ఆ పార్టీ రాజకీయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన రాజీనామా చేయాలంటూ టీడీపీ సహా కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తూ వచ్చారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గురువారం రాజీనామా చేయాలని కోరడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన కార్యాలయానికి వచ్చి తమ కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖ పంపారు. అదే సమయంలో ఆచార్య ప్రసాద రెడ్డి నియమించిన రిజిస్ట్రార్ ఆచార్య జేమ్స్ స్టీఫెన్ను కూడా ముందుగానే ఆ పదవి నుంచి తొలగించి, ఏయూ అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య కిషోర్ బాబును ఇన్ఛార్జ్ రిజిస్టార్ గా నియమించారు. కాగా ఆంధ్రా విశ్వవిద్యాలయానికి తక్షణమే ఒక ఆచార్యున్ని ఇన్ఛార్జ్ వీసీగా నియమించాల్సి ఉంది.