. ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకునే చర్యలపై నాలుగు వారాల్లో అఫిడవిట్ ఇవ్వండి
. యూజీసీకి సుప్రీంకోర్టు సూచనలు
న్యూదిల్లీ : విద్యా వ్యవస్థల్లో వివక్ష ఆక్షేపణీయమని, ఇది తేలికగా తీసుకునే అంశం కాదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కిచెప్పింది. ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వివక్షా రహిత వాతావరణాన్ని కల్పించేందుకు తీసుకున్న, ప్రతిపాదించిన చర్యలేమిటో వెల్లడిరచాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి సూచించింది. విద్యావ్యవస్థల్లో కుల వివక్షను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన పీహెడ్డీ స్కాలర్ రోహిత్ వేముల, వైద్య విద్యార్థిని పాయల్ తావ్డీ తల్లుల ఫిర్యాదును జస్టిస్ ఏఎస్ బొపన, జస్టిస్ ఎంఎం సుర్దేశ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ క్రమంలో యూజీసీని తగు వివరాలు కోరింది. పిటిషనర్ల నుంచి సూచనలు తీసుకోవాలని, చర్యలపై నాలుగు వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పీహెడ్డీ స్కాలర్, దళిత విద్యార్థి రోహిత్ వేముల 2016, జనవరి17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడగా, ముంబైలోని టీఎన్ టోపివాలా నేషనల్ మెడికల్ కాలేజి, గిరిజన విద్యార్థిని పాయల్ ముగ్గురు వైద్యుల కుల వివక్షకు 2019, మే 22న బలయ్యారు. ‘వివక్షపై ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకునే చర్యలు ఏమిటి? వివక్ష తేలికగా తీసుకునే అంశం కాదు. యూజీసీ పట్టిష్ఠ చర్యలు చేపట్టాలి. అది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రయోజనకరం. ఇటువంటి ఘటనలు (విద్యార్థుల ఆత్మహత్యలను ఉద్దేశించి) పునరావృతం కాకుండా ఉంటాయి’ అని యూజీసీ తరపు న్యాయవాదులకు న్యాయస్థానం సూచించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. పిటిషనర్లు తమ బిడ్డలను కోల్పోయారని, ఐఐటీ బాంబే, నేషనల్ లా స్కూలులో చదివే ముగ్గురు విద్యార్థులు ఏడాది కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఈ పిటిషన్ను అత్యవసరమైనదిగా పరిగణించాలని, యూజీసీ వెంటనే తగు మార్గదర్శకాలను రూపొందిస్తే వాటిని ఉన్నత విద్యావ్యవస్థలు ఆచరిస్తాయని, ప్రస్తుత మార్గదర్శకాలతో ఉల్లంఘనలపై పటిష్ట చర్యలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపు నివారణకు పోష్ చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం వంటివి వివక్షకూ అవసరమని జైసింగ్ వాదించారు. యూజీసీ తరపు న్యాయవాది స్పందిస్తూ కమిషన్కు పరిస్థితుల గురించి తెలుసని, ఇప్పటికే కాలేజి ప్రిన్సిపల్స్, వర్సిటీల వీసీలకు సూచనలు చేసిందని చెప్పారు. రెండు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వివక్షకు గురికాకుండా చర్యలు తీసుకోవడం ముఖ్యమని, అందుకు హామీనిచ్చే పద్ధతులు, చర్యలను వివరిస్తూ అఫిడవిట్ను నాలుగు వారాల్లో సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.