47 మంది ఎమ్మెల్యేలు అనుకూలం, 29 ప్రతికూలం
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధిం చింది. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టిన ‘విశ్వాస తీర్మానం’ గెలిచింది. సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47, వ్యతిరేకంగా 29 ఓట్లు పడ్డాయి. దీంతో జార్ఖండ్ సర్కార్ మనుగడకు అడ్డంకులు తొలగిపోయాయి. దీనికి ముందు ముఖ్యమంత్రి చంపై సోరెన్ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భూకుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వ విశ్వాస పరీక్షకు హాజరయ్యారు. 81 మంది సభ్యులు గల అసెంబ్లీలో విశ్వాస తీర్మానంపై చర్చను ముఖ్యమంత్రి చంపై ప్రారంభిస్తూ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, 2019లో హేమంత్ సోరెన్కు ప్రజాతీర్పు లభించిందని గుర్తుచేశారు. అలాంటి ముఖ్యమంత్రిని భూకుంభకోణం కేసులో అరెస్టు చేశారని చంపై సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ చరిత్రలో గిరిజనులు ఎప్పుడు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూసినా ఆ నాయకత్వాన్ని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని విమర్శించారు. హేమంత్ సోరెన్ విషయంలో ఎలాంటి అన్యాయం జరిగిందో ఈరోజు యావద్దేశ ప్రజలు చూశారని, మీరు ఏ గ్రామానికి వెళ్లి చూసినా ప్రతి ఇంట్లోనూ హేమంత్ సోరెన్ ప్రవేశపెట్టిన పథకాలు కనిపిస్తాయని సీఎం చెప్పారు.