. తొలిదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
. నామినేషన్లు ప్రారంభం… 27 చివరితేదీ
. ఏప్రిల్ 19న 102 ఎంపీ స్థానాలకు పోలింగ్
న్యూదిల్లీ : దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఫలితంగా నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 27 కాగా, 28న నామినేషన్ల పరిశీలన జరగనుండగా… మార్చి 30 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఏప్రిల్ 19న వివిధ రాష్ట్రాల్లోని 102 నియోజకవర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందులో తమిళనాడులో 39 నియోజకవర్గాలుండగా… రాజస్థాన్12, ఉత్తర్ప్రదేశ్
8, మధ్యప్రదేశ్6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలో ఐదేసి స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది. అలాగే బీహార్లో 4, పశ్చిమబెంగాల్
3, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయాల్లో రెండేసి, చత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరీలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. కాగా మిగతా రాష్ట్రాల్లో నామినేషన్ల పరిశీలన మార్చి 28న ఉండగా, బీహార్లో మాత్రం ఈ నెల 30న ఉండనుంది. అభ్యర్థులు ఏప్రిల్2 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ 18వ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19 జరగనుండగా, ఆ తర్వాత ఆరు దశల్లో ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికలు జరుగుతాయి. జూన్4న ఓట్లు లెక్కింపు ఉంటుంది. కాగా అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. 2019 ఎన్నికల్లో అధికార బీజేపీ రెండు లోక్సభ స్థానాలను గెలుచుకోగా… అసెంబ్లీలో బీజేపీ 41 సీట్లు, జేడీ(యూ) ఏడు సీట్లు, ఎన్పీపీ ఐదు సీట్లు, కాంగ్రెస్ నాలుగు సీట్లు, పీపీఏ ఒక సీటులో గెలుపొందగా… ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. కాగా ఈ రాష్ట్రంలో బీజేపీ అన్ని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అరుణాచల్ పశ్చిమ లోక్సభ స్థానానికి కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, అరుణాచల్ తూర్పు స్థానానికి తపిర్ గావ్ను అభ్యర్థులుగా ప్రకటించింది. ఇక మొదటి దశలో అసోంలో కాజిరంగా, సోనిత్పూర్, దిబ్రూగఢ్, లఖింపూర్, జోర్హాట్ స్థానాలకు ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. పోటీలో ఉన్న దిబ్రూగఢ్ నుంచి కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్, జోర్హాట్ నుంచి లోక్సభలో కాంగ్రెస్ ఉపనేత గౌరవ్ గొగోయ్ తదితరులు ఉన్నారు. పుదుచ్చేరిలో, రిటర్నింగ్ అధికారి ఎ.కులోత్తుంగన్ కేంద్రపాలిత ప్రాంతంలోని ఏకైక లోక్సభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేశారు. కాగా మొదటి దశలో జమ్మూకాశ్మీర్లోని ఉధంపూర్-కతువా లోక్సభ నియోజకవర్గంలో కూడా పోలింగ్ జరగనుంది. ఇప్పటివరకు బీజేపీ, డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ మాత్రమే ఈ స్థానానికి తమ అభ్యర్థులను ప్రకటించాయి. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, మాజీ మంత్రి జీఎం సరూరి అభ్యర్థులుగా ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్లో కొన్ని మార్పులు చేసిన సంగతి విదితమే. అరుణాచల్ప్రదేశ్, సిక్కింలో ఓట్ల లెక్కింపును జూన్ 4 నుంచి జూన్ 2వ తేదీకి మార్చింది.
96.88 కోట్ల మంది ఓటర్లు
దేశంలో మొత్తం 96.88 కోట్ల ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 49.7 కోట్ల మంది ఉండగా, మహిళలు 47.1 కోట్ల మంది ఉన్నారు. 85 ఏళ్ల పైబడిన ఓటర్ల సంఖ్య 82 లక్షలు. 20-29 ఏళ్ల వయసు మధ్య ఉన్న ఓటర్లు 19.74 కోట్ల మంది ఉన్నారు. ఈసారి 18-19 వయసున్న 1.8 కోట్లు యువ ఓటర్లు కొత్తగా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఈ ఎన్నికల కోసం 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తున్నారు. 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది పాలు పంచుకోనున్నారు.