. నాలుగో జాబితాపై సీఎం కసరత్తు
. క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యేలు
. ఉమ్మడి ప్రకాశంలో మార్పులు
. జగ్గయ్యపేట సీటు కోరిన వాసిరెడ్డి పద్మ
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : వైసీపీ నాలుగో జాబితాపై కసరత్తు ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రతి జాబితాలోనూ సిట్టింగ్ల సీట్లు గల్లంతవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలను పక్కనపెట్టి కొత్త అభ్యర్థులను తెరపైకి తీసుకురావడంతో వారికి దిక్కు తోచడం లేదు. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తామని చెబుతున్నప్పటికీ అంతర్గతంగా ఎమ్మెల్యేలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల మార్పుల్లో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలను సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. వారితో చర్చలు జరుపుతున్నారు. వారితోపాటు ఆ జిల్లాలకు చెందిన మంత్రులు, సీనియర్ నేతలు వచ్చారు. ఆశావహులు కూడా తమకు టికెట్లు కేటాయించాలంటూ సీఎంకు విన్నవించుకుంటున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, జోగి రమేశ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మానుగుంట మహిధర్రెడ్డి తదితరులు జగన్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ సీఎంను కలిశారు. తనకు జగ్గయ్యపేట సీటు కేటాయించాలని జగన్కు విన్నవించారు. ముందుగా ఆమె రాజమండ్రి సీటు ఆశించారు. అయితే ఆ నియోజకవర్గానికి మార్గాని భరత్ను ఇన్చార్జిగా ప్రకటించడంతో తన స్వస్థలమైన జగ్గయ్యపేట సీటైనా ఇవ్వాలని ఆమె అభ్యర్థించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అనేకమంది ఇన్చార్జిల మార్పులు, చేర్పులపై సీఎం దృష్టి సారించారు. ఆ జిల్లాలకు చెందిన మంత్రులు, ముఖ్యనేతల అభిప్రాయాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్తో జగన్ చర్చించారు. కొన్ని నియోజకవర్గాలపై స్పష్టత వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తన తనయుడితోపాటు సీఎంను కలిసి టికెట్ల విషయంపై చర్చించారు. బాలినేనికి గురజాల లేదా ఒంగోలు సీటు ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే, బాలినేని సీటుపై స్పష్టత రావాల్సి ఉంది. నాలుగో జాబితాలో 30 పార్లమెంట్, అసెంబ్లీ ఇన్చార్జిల మార్పులు ఉండే అవకాశం ఉంది. తన సోదరి షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళ్లడం, శుక్రవారం విజయవాడ స్వరాజ్య మైదానంలో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో సీఎం జగన్ బిజీబిజీగా ఉండనుండటంతో నాలుగో జాబితా విడుదలపై ఉత్కంఠ నెలకొంది.