. మోదీ సర్కారు వైఫల్యాలు వెనక్కు… అవాస్తవాలు ముందుకు
. ‘ఎమర్జెన్సీ’తో రాజకీయం
. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూదిల్లీ: రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ‘ఎమర్జెన్సీ’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు. గురువారం కొత్తగా కొలువుదీరిన 18వ లోక్సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా విధించిన ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ కాలాన్ని ఆమె అభివర్ణించారు. భారత రాజ్యాంగంపై అదో మచ్చలా మిగిలిపోయిందన్నారు. ఎమర్జెన్సీ విషయంలో బీజేపీ, విపక్షాల మధ్య కొన్నిరోజులుగా వాగ్వాదం జరుగుతున్న క్రమంలో బుధవారం లోక్సభలో స్పీకర్ ఓంబిర్లా చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. మళ్లీ ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేయడంతో విపక్షాలను ఆగ్రహానికి గురిచేసింది. ముర్ము తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… భారత్ను ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో భారత్ శరవేగంగా ఆత్మనిర్భర్ దిశగా వృద్ధి చెందుతోందన్నారు. పేపర్ లీకేజీ లాంటి విషయాల్లో దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందనితెలిపారు. జమ్మూకశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కానీ ఈ ఎన్నికల్లో కశ్మీర్ లోయలో మార్పు కనిపించిందనిజ… శత్రువుల కుట్రలకు అక్కడి ప్రజలు గట్టిగా బదులిచ్చారన్నారు. అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం విశేషం అన్నారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ (సంస్కరణలు, పనితీరు, మార్పు) ఆధారంగా ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారన్నారు. గత పదేళ్ల పాలనలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందని, పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందన్నారు. ‘ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తోంది. పెద్ద ఎత్తున మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. మహిళల ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. మహిళల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టాం. పౌరవిమానాయాన రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆర్థిక భరోసా కోసం నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మెట్రో సేవలు విస్తరించాం’ అని ముర్ము తన ప్రసంగంలో వివరించారు. తొలుత ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో గెలుపొంది ఎంపీలుగా ప్రమాణస్వీకరాం చేసిన సభ్యులకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజల విశ్వాసాన్ని గెలిచి సభకు ఎన్నికయ్యారని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని, ప్రజలు నిజాయతీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారన్నారు. సార్వత్రిక ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు ఈసీకి అభినందనలు తెలిపారు. ఉభయ సభల ప్రారంభానికి ముందు రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన ద్వారం వద్ద ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్వాగతం పలికారు.