సత్తెనపల్లి : వైద్యశాల నుంచి ఉత్పత్తి అయ్యే జీవ వైద్య వ్యర్ధాలను క్షేత్రస్థాయిలో వేరువేరుగా సేకరించి, అంటువ్యాధులు ప్రభలకుండా చూడాలని శాసనసభ్యులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛ సత్తెనపల్లిగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు. వైద్యులు తమ పనితీరులో సత్తనపల్లి వైద్యశాలను జిల్లాలో ముందువరుసలో ఉంచాలన్నారు. నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేయబోయే రెండవ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం గురించి సంబంధిత జిల్లా అధికారులతో ఫోన్లో చర్చించారు. వైద్యశాల వెనకవైపు నిర్మిస్తున్న గదుల నిర్మాణం పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలకు అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త రామకృష్ణ, చెరుకూరు వెంకట్రావుల సహకారంతో వైద్య సిబ్బందికి ఫ్రిడ్జ్ను అంబటి చేతుల మీదుగా బాహూకరించారు. అనంతరం ఈ నెలలో ఉత్తమ పనితీరు కనపరిచిన సిస్టర్ మేరీ, సుజాత, రాము వెంకయ్య తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, వైద్యశాల సూపరింటెండెంట్ సుష్మ, అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త రామకృష్ణ, కాజా, ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.