ఎమ్మెల్యే కిలారి
విశాలాంధ్ర`పొన్నూరు : పట్టణంలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు అదనపు గదుల నిర్మాణాలలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు కృషి చేస్తానని శాసనసభ్యులు కిలారి వెంకట రోశయ్య స్పష్టం చేశారు. స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆదివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమావేశానికి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విఠల్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తన ముందు ఉంచిన సమస్యలకు ఎమ్మెల్యే రోశయ్య సమాధానమిస్తూ బార్ అసోసియేషన్కు సొంత భవన నిర్మాణానికి శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కోర్టు పరిధిని పెంచుతూ మరికొన్ని మండలాలను పొన్నూరు కోర్టు పరిధిలోకి తీసుకువచ్చే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలలో అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. సీనియర్ న్యాయవాది మానుకొండ సుధాకర్, మరికొందరు సీనియర్ న్యాయవాదులు కలసి జూనియర్ న్యాయవాదులు, న్యాయవాది గుమస్తాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసేందుకు ముందుకు వచ్చిన తీరును ఆయన అభినందించారు.