టోక్యో : సుగా వారసుడిగా దేశ నూతన ప్రధానమంత్రిగా జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) నాయకుడు కిషిడా ఫుమియో సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు.. ప్రతినిధుల సభ, హౌస్ ఆఫ్ కౌన్సిలర్ల మెజారిటీ ఓట్లను 64ఏళ్ల కిషిడా సాధించారు. ఇంపీరియల్ ప్యాలెస్లో జరిగిన వేడుకలో జపాన్ నూరవ ప్రధానమంత్రిగా పదవీ స్వీకారం చేసారు. 20 మందితో కిషిడా త్వరలోనే తన క్యాబినెట్ను ప్రకటిస్తారు. 20 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే మహిళలు ఉంటారు. కిషిడా ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన అనంతరం ఆయన ఎదుర్కొనే ప్రధాన పరీక్ష దేశంలో సాధారణ ఎన్నికలు. అక్టోబరు 31న ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రచారం ఈ నెల 19నుండి ప్రారంభం కానుంది. గత రెండు దశాబ్దాలుగా జపాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల నుండి దేశాన్ని నూతన పెట్టుబడీదారీ విధానంతో, మధ్యతరగతి ప్రజల ఆదాయాలను మరింత పెంచుతూ ప్రజలమధ్య అసమానతలు తగ్గిస్తానని కిషిదా ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. కొవిడ్`19 మహామ్మారి ప్రభావానికి లోనైన ప్రజలకు సహాయం చేసేందుకు ఆర్థిక సహాయం క్రింద పది ట్రిలియన్ల యెన్లను ప్రకటించనున్నారు. సుగా కేబినెట్ సోమవారం ఉదయం రాజీనామా చేసింది. కోవిడ్ నియంత్రణలో సుగా మంత్రివర్గం ఘోరంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి.