శాంటియాగో : సోషలిస్టు నేత, చిలీ మాజీ అధ్యక్షుడు సాల్వెడార్ అలెండేకి చిలీ వాసులు ఘన నివాళి అర్పించారు. దేశ రాజధానిలోని లా మోనెడా ప్యాలెస్ పక్కన ఉన్న ఆయన స్మారక చిహ్నానికి కమ్యూనిస్టు పార్టీ(పీసీ), సోషలిస్టు పార్టీ (పీఎస్), డెమోక్రసీ పార్టీ (పీపీడీ) ప్రతినిధులు, వందలాదిమంది ప్రజలు అలెండీ స్మారక కార్యక్రమాలు నిర్వహించారు. సాల్వడార్ అలెండే చిలీ 28వ అధ్యక్షుడిగా 1970 నుండి 1973 సెప్టెంబరు 11 వరకు ఉన్నారు. చిలీలో సైనిక తిరుగుబాటు జరిగి 48 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ కాలంలో మరణించిన, ఆచూకీ లేకుండాపోయిన వారిని గుర్తు చేసుకుంటూ దేశంలోని అన్ని నగరాల్లో మానవ హక్కుల కార్యకర్తలు ర్యాలీలు చేశారు. 1973 అగస్టో పినోచెట్ నేతృత్వంలో చోటుచేసుకున్న తిరుగుబాటులో అసువులుబాసిన వారి సమాధులపై పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించారు. అలెండే ప్రభుత్వం సాధించిన విజయాలను వక్తలు ప్రస్తుతించారు. వామపక్ష పార్టీలు, యువజన సంఘాలు, సామాజిక ఉద్యమకారులు, మృతుల బంధువులు భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చారు.