వాషింగ్టన్: లిథియం అయాన్ బ్యాటరీ సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత జాన్ గుడినఫ్ (100) కన్నుమూశారు. రెండవ ప్రపంచ యుద్ధమప్పుడు అమెరికా సైన్యంలో వాతావరణ శాస్త్రతవేత్తగా గుడినఫ్ పనిచేశారు. 1952లో ఫిజిక్స్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్డీ పొందారు. 2019లో రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని అందుకున్నారు. గుడినఫ్ మరణవార్తను టెక్సాస్ యూనివర్సిటీ ప్రకటించింది. తమ వర్సిటీలో ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా పనిచేసే గుడినఫ్ ఆదివారం టెక్సాస్లోని ఆస్టిన్లో తుదిశ్వాస విడిచినట్టు వర్సిటీ ప్రకటన పేర్కొంది.‘ఈ అమెరికన్ తన కెరీర్లో అనేక దశాబ్దాలుగా శాస్త్రీయ పరిశోధనలో అత్యాధునికమైన నాయకుడిగా ఉన్నారు. ఆయన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది జీవితాలను మెరుగుపర్చాయి. ఆయన అద్భుత శాస్త్రవేత్త’ అని ఆస్టిన్లోని టెక్సాస్ యూనివర్సిటీ అధ్యక్షులు జే హార్టజెల్ పేర్కొన్నారు. 1986లో 64ఏళ్ల వయస్సులో టెక్సాస్ యూనివర్సిటీలో చేరిన గుడినఫ్ 37ఏళ్ల పాటు కాక్రెల్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లో ఫ్యాకల్టీగా ఉన్నారు. 97ఏళ్ల వయస్సులో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న గుడినఫ్ ఈ అవార్డు గ్రహీతల్లో పెద్ద వయస్కునిగా నిలిచారు. లిథియం అయాన్ బ్యాటరీలను సృష్టించేందుకు ఈ పురస్కారం ఆయనను వరించింది. అయితే దీనిని జపాన్కు చెందిన అకిరా యోషినో, బ్రిటన్కు చెందిన స్టాంల్లే విట్టింగ్హమ్తో ఆయన పంచుకున్నారు. స్మార్ట్ ఫోన్లనే కాదు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ లిథియం అయాన్ బ్యాటరీయే ఆధారం. 1980 వ దశకంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఫ్రొసెసర్గా ఉన్న సమయంలో లిథియం కోబాల్ట్ ఆక్సైడ్ క్యాథోడ్ బ్యాటరీని గుడినఫ్ అభివృద్ధి చేశారు. బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ విట్టింగ్హమ్ అభివృద్ధి చేసిన నమూనాకు గుడినఫ్ మరింత మెరుగులద్దారు. అధిక ఇంధన నిల్వ సామర్థ్యం, భద్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టారు. లిథియం అయాన్ బ్యాటరీ ఆవిష్కరణలో ముఖ్య భూమిక పోషించినప్పటికీ రాయల్టీని పొందలేకపోయారు. బ్రిటిష్ ఆటోమిక్ ఎనర్జీ రిసెర్చ్ అసోసియేషన్తో బ్యాటరీ పరిశోధనపై హక్కులకు సంబంధించి సంతకం చేశారు.