ఇటలీ, పోలాండ్, స్పెయిన్, బల్గేరియాలో నిరసనల హోరు
రోమ్/వార్సా: యూరప్ నిరసనలతో హోరెత్తింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుసరించే రైతు వ్యతిరేక వ్యవసాయ, పర్యావరణ విధానాలు, విధించే ఆంక్షలు, చౌకగా ఈయూ యేతర దేశాల నుంచి పంటోత్పత్తుల దిగుబడులకు వ్యతిరకంగా ఇటలీ, పోలాండ్, స్పెయిన్, బల్గేరియా దేశాల్లో రైతులు భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించారు. ‘రైతులు లేకపోతే… ఆహారంభవిష్యత్ ఉండదు’ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. పండని పంటలకు చెల్లింపులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇటలీలో రైతుల ఆందోళన భారీస్థాయిలో జరిగింది. రోమ్లోని చారిత్రక కూటమి వద్ద ట్రాక్టర్ల కాన్వాయ్ చేరుకొని నిరసన తెలిపింది. జాతీయ పతాకాలను రైతులు ప్రదర్శించారు. ‘మాకు మా ప్రాధాన్యతలు ఉన్నాయి. మేము నియమాలకు కట్టుబడి వ్యవహరించాం. మా ప్రాధాన్యతలను అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయకూడదని కోరుకుంటున్నాం’ అని రైతు నాయకుడు సాల్వటోరె ఫైస్ అన్నారు. పెరుగు తున్న సాగు వ్యయం, తగ్గుతున్న పంటోత్పత్తుల ధరలు, చౌకగా దిగమతులు, వ్యవసాయం
పర్యావరణంపై రైతు వ్యతిరేక ఈయూ విధానాలకు వ్యతిరేకంగా యూరప్ వ్యాప్తంగా చాలా రోజులుగా నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
పోలాండ్లో
పోలాండ్లో రైతుల ఆందోళన 30 రోజుల పాటు కొనసాగనుంది. ప్రధాన కూడళ్లలో ట్రాక్టర్లతో రైతులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రధాన రహదారులను దిగ్బంధించారు. ఉక్రెయిన్తో పంచుకునే సరిహద్దు క్రాసింగులను మూసివేసి తమ నిరసన వ్యక్తంచేశారు. రైతుల ఆందోళన క్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతల నిషేధానికి మద్దతిస్తానని పోలాండ్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రకటించారు.
స్పెయిన్లో
స్పెయిన్ రైతుల ఆందోళన శనివారం ఐదో రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాలు, రహదారులు, పోర్టుల దిగ్బంధనాలు కొనసాగాయి. మాడ్రిడ్ ముట్టడికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. స్పెయిన్ జెండాలతో ట్రాక్టర్ల కాన్వాయ్ ఎ`2 హైవే నుంచి మాడ్రిద్లోని తోరిజా సెంట్రల్ టౌన్ వరకు సాగింది. తమ డిమాండ్లను సత్వరమే పరిష్క రించకపోతే పోరు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
బల్గేరియాలో
బల్గేరియాలో మంగళవారం నుంచి రైతులు ఆందోళన బాట పట్టారు. దేశ వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రొమేనియా వైపున గ్యుర్గుయూ సరిహద్దు క్రిసింగ్ పాయింట్ మార్గాన్ని దిగ్బంధించారు.