కరాచీ: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ఆ దేశం దివాలా తీసే పరిస్థితి నెలకొంది. ఆర్థిక వనరులు సరిపడ లేక పౌరుల కనీస అవసరాలను తీర్చలేని దుస్థితికి చేరుకుంది. తాజా పరిణామాలతో దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. పాలు, పిండి మొదలు ఉల్లిపాయలు, చికెన్ వరకు అన్నింటి ధరలు తారాస్థాయికి పెరిగాయి. దీంతో అక్కడి ప్రజలు ఏమి కొనాలో… ఏమి తినాలో తెలియక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కరాచీలో పాల ధరలు అమాంతం పెరిగాయి. లీటరు రూ.190 నుంచి రూ.210కి పెరిగింది. లూజ్ మిల్క్, పాకెట్ మిల్క్ ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ధర రూ.500గా ఉంది. ద్రవ్యోల్బణం ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఆ దేశ ప్రభుత్వం పన్నులతో కూడిన మినీ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్లో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుపై రూ.22.20 చొప్పున పెరిగి రూ.272కి చేరింది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.17.20 పెరిగి రూ.280కి పెరిగింది. కిరోసిన్ కూడా లీటరుకు 12.90 పెరిగి రూ.202.73 పలుకుతోంది. లైట్ డీజిల్ ధర రూ.196.68కు చేరింది. కొత్త ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. పాక్కు నిధుల విడుదల కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేక నిబంధనలు విధించింది. ఈ క్రమంలోనే మినీ బడ్జెట్ను ప్రవేశపెట్టి పన్నులను ప్రభుత్వం పెంచింది.