Saturday, May 18, 2024
Saturday, May 18, 2024

ఫ్రాన్స్‌లో మేడే నిరసనలు హింసాత్మకం

. పింఛన్‌ సంస్కరణ ఉపసంహరణకు పెరిగిన డిమాండ్‌
. వీధుల్లోకొచ్చిన 7,82,000 మంది
. పారిస్‌లో ఉద్రిక్తత
. బాష్పవాయువు, జలఫిరంగులు, లాఠీలు ప్రయోగించిన భద్రతా సిబ్బంది
. ఘర్షణలో 108 మంది పోలీసులకు గాయాలు
. 300 మంది నిరసనకారులు అరెస్టు
. హింస ఆక్షేపణీయం: ప్రధాని

పారిస్‌: వివాదాస్పద పింఛన్‌ సంస్కరణల ఉపసంహ రణకు డిమాండు మిన్నంటింది. మేడే సందర్భంగా లక్షల సంఖ్య ప్రజలు, కార్మిక సంఘాల వారు కదంతొక్కడంతో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రణరంగాన్ని తలపించింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా సిబ్బంది భారీగా మోహరించి నిరసనకారులను చెదరొగ్టే ప్రయత్నం చేయడంతో కొన్ని చోట్ల హింస చోటుచేసుకుంది. 108 మందికిపైగా పోలీసులు గాయపడగా ఇలా జరగడం ఇదే మొదటిసారిగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుమారు 300 మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. ఫ్రాన్స్‌లో మాక్రాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన పింఛన్‌ సంస్కరణల ఉపసంహరణకు ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు. రాజధాని పారిస్‌, లైన్‌, మార్సెల్లెతో పాటు ప్రధాన నగరాల్లో నిరసనలు మిన్నంటాయి. భద్రతా సిబ్బందికి, నిరసన కారులకు మధ్య ఘర్షణలు తలెత్తి 108 మంది పోలీసులకు గాయాలయ్యాయి. ఈ మేరకు దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్‌ దర్మానిన్‌ తెలిపారు. పారిస్‌లో ఓ నిరసనకారుడు మోలోటోవ్‌ కాక్‌టేయిల్‌ను విసరడంతో ఒక పోలీసు అధికారి ముఖం, చేతులు కాలిపోయాయని చెప్పారు. పారిస్‌లో నిరసనకారులు పోలీసులపైకి ప్రొజెక్టైళ్లు విసిరారు. దుకాణాల కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బంది బాష్పవాయువు, జలఫిరంగుల ద్వారా నిరసనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. లాఠీలకు పనిచెప్పారు. కొందరు నిరసనకారులు నిప్పు పెట్టగా అది భవనమంతటా వ్యాపించగా అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది.
ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిజబెత్‌ బార్నె హింసను తీవ్రంగా ఖండిరచారు. సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ ప్రదర్శనలు హింసాత్మకంగా మారడం ఆక్షేపణీయమని అన్నారు. మేడే నిరసనల్లో ఇంత మంది పోలీసులు గాయ పడటం ఎన్నడూ జరగలేదని గెరాల్డ్‌ అన్నారు. ఫ్రాన్స్‌లో మొత్తంగా జరిగిన ఆందోళనల్లో 7,82,000 మంది నిరసన కారులు పాల్గొన్నారని, ఒక్క పారిస్‌లోనే 1,12,000 మంది ఆందోళన చేశారని అంతర్గత మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 23 లక్షల మంది పాల్గొన్నట్లు సీజీటీ యూనియన్‌ లెక్కతేల్చింది. ఒక్క రాజధానిలోనే 5,50,000 మంది పాల్గొన్నట్లు వెల్లడిరచింది. గతేడాదితో పోల్చితే ఈసారి మేడే నిరసనల్లో జనం పెద్దఎత్తున పాల్గొన్నారు. వివాదాస్పద పింఛన్‌ సంస్కరణలను తెచ్చి నెలలు గడుస్తున్నా గానీ ఆందోళనలు మరింత తీవ్రతరం అవుతున్నాయని సీజీటీ యూనియన్‌ అధ్యక్షులు సోఫీ బినెట్‌ తెలిపారు. పారిస్‌ నిరసనలో పాల్గొన్న సోఫీ… పింఛన్‌ సంస్కరణ ఉపసం హరణ వరకు వెనక్కి తగ్గేదిలేదని నినాదించారు. తమ ఉద్యమం మరింత ఉదిక్తమవుతుందని అన్నారు. జనవరి నుంచి పింఛన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో సమ్మెలు, ఆందోళనలు జరుగుతుండటం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌కు ‘రెడ్‌ కార్డు’ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది ఆయన ప్రభుత్వంపై పెరుగు తున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సూచికగా తెలిపారు. ఇటీవల ఫ్రెంచ్‌ ఫుట్‌బాల్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు మాక్రాన్‌ హాజరు కాగా ఆయనకు కొందరు రెడ్‌ కార్డులు చూపించారు. ఫ్రాన్స్‌లో ప్రతి నలుగురిలో ముగ్గురు మాక్రాన్‌పై అసంతృప్తితో ఉన్నట్లు ఐఎఫ్‌ఓపీ పోలింగ్‌ గ్రూపు గతనెలలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఇదిలావుంటే, యూరప్‌, స్పెయిన్‌లోనూ మేడే ప్రదర్శనలు జరిగాయి. ‘జీతాలు పెంచాలి, ధరలు తగ్గించాలి, లాభాలను పంచుకోవాలి’ అన్న నినాదంతో 70కుపైగా ర్యాలీలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img