ఏషియన్ దేశాల పిలుపు
లబువాన్ బాజో: మైన్మార్లో హింసను, ఘర్షణలను ఆపాలని ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (ఏషియన్) నేతలు పిలుపునిచ్చారు. ప్రజాఘర్షణ అంతానికి చర్యల్లో ఎలాంటి పురోగతి లేదని ఇండోనేసియా అధ్యక్షుడు, ఏషియన్ నాయకుడు జోకో విడోడో వ్యాఖ్యానించారు. ఇండోనేసియా, తూర్పు నుసా తెంగ్గారా ప్రావిన్స్లోని లబువాన్బాజోలో రెండ్రోజుల 42వ ఏషియన్ సదస్సు సందర్భంగా గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జోకో మాట్లాడారు. ‘నేను నా సహచర ఆసియా దేశాల నాయకులతో నిజాయితీగా చెబుతున్నా… మైన్మార్లో హింసను, ఘర్షణలను ఆపేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఐదాంశాల రాజీ ప్రక్రియలో పురోగతి లేదు’ అని అన్నారు. ఏషియన్ చైర్పర్సన్గా ఉన్న ఆయన మైన్మార్ను దృష్టిలో పెట్టుకొని పది దేశాలు రూపొందించిన శాంతి ప్రణాళికను ఈ సందర్భంగా ప్రస్తావించారు. అన్ని పక్షాలను కలుపుకుని చర్చలు జరిగేందుకు, మానవతా సాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని మైన్మార్ సైనిక ప్రభుత్వానికి సభ్యదేశాలతో కలిసి సూచించారు. ‘మైన్మార్లో జరుగుతున్న హింసను తక్షణమే ఆపాలని కోరుతున్నాం. జాతీయ చర్చలకు వీలు కల్పిస్తూ, సురక్షితంగా, సకాలంలో మానవతా సాయం అందేందుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు చర్యలు తీసుకోండి’ అని మైన్మార్ ప్రభుత్వాన్ని ఏషియన్ దేశాలు కోరాయి.