విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండలంలో సీజనల్ హాస్టల్లు వెంటనే ప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు ఈరేష్ అధికారులను డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు తల్లిదండ్రులు వలసలు తీసుకెళ్లకుండ ఇంటి వద్ద వదలి వెళ్లిన విద్యార్థులతో నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కరువు, కాటకాలతో, వలసలతో అల్లాడిపోతున్న మండలాలను గుర్తించారని తెలిపారు. విద్యార్థులను వలసలు వెళ్లకోకుండ విద్యార్థులకు విద్య, వసతి అందించడం కోసం జిల్లాలో 30 సీజనల్ హాస్టల్లను ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అందుకు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా సీజనల్ హాస్టల్లు ప్రారంభం కాలేదన్నారు. అధికారుల మాటలు కేవలం పత్రిక ప్రకటనలకే పరిమితం అవుతున్నాయని మండి పడ్డారు. విద్యార్థులను వలసలు నివారించడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. మండలంలో సీజనల్ హాస్టల్లు ప్రారంభించక పోవడంతో పాఠశాలలో రోజు రోజుకు విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థులను వలసలకు తీసుకెళ్లకుండ తల్లిదండ్రులలో అవగాహన కల్పించాలని, అలాగే వలసలు వెళ్లినా విద్యార్థులను సీజనల్ హాస్టల్లో ఉంచి చదువుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.