వారిపై చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా ఆపాలి
మోదీపై సోనియాగాంధీ ఫైర్
జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పేటల్, మౌలానా అబుల్కలామ్ ఆజాద్ లాంటి మహోన్నత నేతలను కించపరచడానికే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మండిపడ్డారు. రాజకీయంగా తమకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీరిపై చేస్తున్న ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని కోరారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 75 సంవత్సరాలుగా భారత బలగాలు దేశానికి చేసిన త్యాగాలను తక్కువ చేసి చూపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, రాజకీయ ప్రయోజనాల కోసం చారిత్రక వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తోందని, అటువంటివాటిని కాంగ్రెస్ పార్టీచూస్తూ ఊరుకోబోదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అనుసరిస్తోన్న ఫాసిస్టు ధోరణిని తీవ్రంగా తప్పుపట్టారు. క ర్ణాటకలో బీజేపీ హర్ ఘర్ తిరంగాలో భాగంగా నెహ్రూ ఫొటోను తొలగించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో గతంలో సాధించిన విజయాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని, వాటిని అణగదొక్కుతోందన్నారు. 75 సంవత్సరాలుగా, అత్యంత ప్రతిభావంతులైన భారతీయులు అన్ని రంగాలలో దేశాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించారని, స్వేచ్ఛ, న్యాయమైన, పారదర్శక ఎన్నికల వ్యవస్థకు మహానుభావులు పునాదులు వేశారని, ఇప్పుడు ఆ పునాదులను కూకటివేళ్లతో సహా పెకిలించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. భిన్నత్వంలో ఏకత్వంద్వారా దేశం మంచి గుర్తింపు తెచ్చుకుందని, అదే ఈ జాతికి బలమన్నారు.