పూణె : మహరాష్ట్ర నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దాడులు రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించి, రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకేనని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. ఇటీవల ఈడీ హవాలా కేసుల రూపంలో మహరాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్, ఎన్సీపీ నేత ఎక్నాథ్ ఖడ్సే, శివసేన ఎంపీ భావనా గవాలీ స్థావరాలపై దాడులు నిర్వహించింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో రాష్ట్రంలో ఈడీ దాడులు చూడలేదు. ఇది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించడమే, ఈడీని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులకు దెబ్బతీస్తున్నారని పవార్ అన్నారు. భావనా గవాలీపై వచ్చిన ఆరోపణలో చారిటీ కమిషన్ ముందు కేసు నమోదు చేయాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ నేరుగా ఈడీ విచారణ చేస్తుందని ఆయన అన్నారు. కరోనా కట్టడికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే జారీ చేసిన ఆదేశాలు ప్రకారం బహిరంగ కార్యక్రమాలలో పాల్గొనబోనని, తక్కువ సభ్యులు ఉన్న కార్యక్రమాలకు పరిమితమవుతానని పవార్ పేర్కొన్నారు.