లక్నో: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర పార్టీల నేతలపై అవినీతి ఆరోపణలతోపాటు ఇతర కేసులు నమోదు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్, ఆయనతో కలిసి ఎన్నికల్లో పోటీకి జతకట్టిన రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధ్యక్షుడు జయంత్ చౌదరిపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించారని వారిపై ఆరోపణలు గుప్పించారు. అఖిలేశ్ యాదవ్, జయంత్ చౌదరి కలిసి గురువారం రాత్రి గేటర్ నోయిడాలో పెద్ద సంఖ్యలో తమ పార్టీ కార్యకర్తలను సమీకరించినట్లు ఎఫ్ఆర్ఐలో పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఎస్పీ, ఆర్ఎల్డీ చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ఎల్డీ అధినేత జయంత్ చౌదరికి తలుపులు తెరిచే ఉన్నాయంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత జయంత్ బీజేపీతో జతకడతారని ప్రచారం చేస్తున్నారు. అయితే జయంత్ చౌదరి దీనిని ఖండిరచారు. జాట్ల ఓట్లను చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించవని అన్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో ఈ నెల 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్నది. ఈసారి నాలుగు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొన్నది. దీంతో ఆ రాష్ట్రంలోని అధికార బీజేపీ, ఎస్పీ-ఆర్ఎల్డీ కూటమి, మయావతి నేతృత్వంలోని బీఎస్పీతోపాటు కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.