గవర్నరుకు సీఎం ఖట్టర్ వినతి
ఛండీగఢ్: చరణ్జిత్సింగ్ చన్నీ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, రాష్ట్రపతి పాలనలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంజాబ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రధాని నరేంద్రమోదీకి భద్రత కల్పించలేకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఫిరోజ్పూర్ ఘటనపై రాష్ట్ర గవర్నరు బండారు దత్తాత్రేయకు రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఓపీ ధంకర్ వినతిపత్రం అందజేశారు. పంజాబ్ ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేయాలని గవర్నరుకు విజ్ఞప్తిచేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రపతి పాలన కింద నిర్వహించాలని కోరారు. ‘పంజాబ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్రపతి పాలన విధించాలని కోరాం. ఎన్నికల వేళ అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రచారంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్రమోదీ మళ్లీ రాష్ట్రానికి వస్తారు. తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం శాంతిభద్రతలను సమర్ధవంతంగా నిర్వహించలేదు’ అని ఖట్టర్ విలేకరులతో అన్నారు.