Friday, March 31, 2023
Friday, March 31, 2023

చర్చ లేనప్పుడు పార్లమెంట్‌ ఎందుకు?: శశిథరూర్‌

న్యూదిల్లీ: సమావేశాలే జరగనప్పుడు పార్లమెంట్‌ ఎందుకని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శశి థరూర్‌ విమర్శించారు. పార్లమెంట్‌లోని ఉభయ సభలు తరుచూ వాయిదా పడుతుండడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజాప్రతినిధులు పార్లమెంట్‌కు వస్తారని, వారందరి వాదనలు వినాల్సిన అవసరం ఉందని, కానీ ఇక్కడ అలాంటి వాతావరణం లేదని థరూర్‌ విమర్శించారు. గురువారం ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. రైతు నిరసన, పెగాసస్‌ వంటి సమస్యలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుపట్టగా, ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. దీంతో సభలో రెండు పక్షాల గందరగోళం మధ్య సభాపతులు అటు రాజ్యసభను ఇటు లోక్‌సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా శశిథరూర్‌ స్పందిస్తూ ‘చర్చ జరగడానికి అనుమతిస్తే ఎంపీలు తమ నియోజకవర్గాలు, రైతుల ఆందోళనలను వినిపించవచ్చు. సంక్షోభానికి పరిష్కారాలను ప్రతిపాదించవచ్చు. అయితే రైతు సంఘాల డిమాండ్లను అంగీకరించడానికి ప్రతిపక్షాలు నిరాకరించడంతో చర్చకు ప్రతిపక్షాల అభ్యర్థనను ప్రభుత్వం మొండిగా తిరస్కరిస్తోంది. ఇది అప్రజాస్వామికం. నిన్న చైనా గురించి మాట్లాడేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈరోజు రైతుల గురించి మాట్లాడానికి ప్రభుత్వం నిరాకరించింది. చర్చలే జరగనప్పుడు ఇక పార్లమెంట్‌ ఎందుకు?’’ అని థరూర్‌ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img